By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 4:57 PM IST
'ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ అవసరం- సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం' - CM Ramesh press meet
BJP MP CM Ramesh Press Meet in Assembly : గత ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరినట్లు ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఈ విషయమై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో ముచ్చటించారు. ఐదేళ్లుగా అసెంబ్లీ వైపే రాలేదన్న ఆయన ఇప్పుడు కూటమి అతి పెద్ద విజయంతో వచ్చినట్లు తెలిపారు. మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందని ఎంపీ రమేశ్ ఆరోపించారు.
అలాగే విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయని వెల్లడించారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్నారు. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలని కోరారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ స్ఫష్టం చేశారు.