Published : 4 hours ago
బాధ్యతగా ఉండే మమ్మల్ని భూకబ్జాదారులుగా నడిరోడ్డుపై నిలబెట్టారు : అమీన్పూర్ హైడ్రా బాధితులు - Ameenpur Hydra victims
Ameenpur Hydra Victims : కనీసం వాహనాలపై చలాన్లు కూడా లేకుండా బాధ్యతగా ఉండే తమని, భూ కబ్జాదారులుగా నడిరోడ్డుపై నిలబెట్టారని అమీన్పూర్లోని ఇటీవల హైడ్రా కూల్చివేసిన భవనాలు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సదరు భవన యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కిష్ణారెడ్డిపేటలోని 90, 92, 74 ప్లాట్లోని రెండు అపార్ట్మెంట్లు, ఒక చిన్నపిల్లల ఆసుపత్రి సహా పలు భవనాలను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకునే నిర్మించామని, కోర్టు ఆర్డర్ ఉన్నా సరే వినకుండా కూల్చివేశారని అస్పత్రి యజమాని డా. ఎండీ రఫీ పేర్కొన్నారు. కనీసం ఆసుపత్రిలోని పరికరాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆయన తెలిపారు.
తన తండ్రి ఆర్మీలో పనిచేశారని, అలాంటి కుటుంబంలో పుట్టిన తాను ఎలా కబ్జాకు పాల్పడతానని మరో యజమాని మధుసూధన్ ఆవేదన వ్యకం చేశారు. చిన్నారులకు పియానో టీచర్గా ఉన్న తనకు జీవితంలో సర్వసం కోల్పోయి, విషాదం నెలకొందని కన్నీరుమున్నీరయ్యారు. వీటన్నింటికి కారణం స్థానిక ఎమ్మార్వో అని ఆరోపించారు. వ్యక్తిగత కక్షతో తమ ఇళ్లు కూల్చేశారని, తాము న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిపారు.