YS Sharmila Fires on CM Jagan in AP :జగన్ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. వైఎస్ఆర్ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ చెప్పారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్ కోరారు, కానీ జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని జగన్ చెప్పారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారని ఆమె ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఏపీలో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి మాత్రమే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు తెలిపారు.
జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు : తాను చంద్రబాబుతో టచ్లో ఉన్నట్లు సీఎం జగన్ ఆరోపిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లు నిరూపించగలరానని ప్రశ్నించారు. కేవలం తన కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే చంద్రబాబును కలిశానని, అంతకు మించి మరోసారి చంద్రబాబును కలిసింది లేదని స్పష్టం చేశారు. సునీత న్యాయం కోసం పోరాడుతుంటే, సునీతా చంద్రబాబుతో చేతులు కలిపిందని దారుణ విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు.