Woman Ask to Help from Telangana Government : ఆ భార్యాభర్తలు చేరొక పని చేస్తూ ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ వారి జీవితానికి ఓ రోడ్డు ప్రమాదం అంధకారంలోకి నెట్టేసింది. నాలుగు పదుల వయసులోనే భర్త మంచానికి పరిమితం కావడం, అతడికి వైద్యం చేయించేందుకు ఇల్లాలు పడుతున్న అవస్థలు చూస్తే మనిషన్నవాడు ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆ బాధలు వర్ణనాతీతం.
పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్ బస్తీకి చెందిన ఎస్కే పాషా, రఫియాలకు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. పాషా ఇల్లెందు పురపాలక సంఘంలోని చెత్త సేకరణ వాహన డ్రైవర్గా పని చేస్తుండేవాడు. రఫియా ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవారు. అప్పటివరకు వారి జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ 2021లో ఇల్లెందు-రొంపేడు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషాకు ఒక్కసారిగా పంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలైన పాషా చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ విధుల్లోకి చేరి గత సంవత్సరం నవంబరు వరకు పని చేశాడు. మళ్లీ డిసెంబరులో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు రావడంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోగా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారు. గత ఆరేళ్లుగా వరంగల్లోని పెద్దాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నా పాషా ఆరోగ్యం మాత్రం మెరుగుపడటం లేదు.