Sunkishala project For Hyderabad Water Needs :నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. గతేడాది మార్చి నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా ఆలస్యమైంది. తొలుత ఈ ప్రాజెక్టుకు రూ.1,450 కోట్లు అవుతాయని భావించినప్పటికీ జాప్యంతో వ్యయం ఏకంగా రూ.2,215 కోట్లకు చేరింది. ఇప్పటివరకు 60శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టులో కీలకమైన ఇన్టేక్ వెల్(సర్జ్పూల్) పనుల్లో సంక్లిష్టత ఏర్పడింది దీంతో లోపల పొరల వరకు రాయిభాగం ఎక్కువగా ఉండటంతో డ్రిల్లింగ్, రాయి తరలింపుతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ వెల్కు సంబంధించి నాలుగు బ్లాకుల్లో 60-70శాతం వరకు పనులు పూర్తి చేశారు. ఇన్టేక్ వెల్లోకి సాగర్ నుంచి నీటిని తరలించేందుకు మూడు ప్రాంతాల్లో మూడు లెవల్లో సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 147 అడుగుల స్థాయిలో ఏర్పాటు చేస్తున్న సొరంగం పనులు ఇంకా పూర్తి కాలేదు.
Minister KTR Latest Tweet : 'హైదరాబాద్ వాసులకు ఇక తాగునీటి సమస్యే ఉండదు'
సుంకిశాల ఇన్టేక్ వెల్ నుంచి కోదాంపూర్ నీటి శుద్ధి కేంద్రం వరకు మూడు వరుసల్లో 2375 ఎంఎం డయాతో భారీ పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కలిపి 35కిలోమీటర్ల వరకు పైపులైను పనులు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 10కిలోమీటర్ల పైపులైన్ల పనులు పూర్తి చేశారు. వచ్చే నాలుగు నెలల్లోనే ఈ పనులన్నీ పూర్తిచేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.