ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!

Visakhapatnam Destruction: దోపిడీల్లో ఒక్కో గ్యాంగ్‌ది ఒక్కో స్టైల్‌! విశాఖలో నాలుగున్నరేళ్లు సాగింది ముందెఎన్నడూ చూడని కొత్తరకం దోపిడీ! విలువైన భూములపై కన్నేయడం, నయానో భయానో కొల్లగొట్టడం, ఒప్పుకోకపోతే వివాదాలు సృష్టించడం, భూ యజమానుల్ని బెదిరించడం, లొంగకపోతే అధికారుల్ని ఉసిగొల్పి కేసులు పెట్టించడం, సెటిల్మెంట్‌కని పిలిచి రాయించుకోవడం! ఇలా థగ్గులు, పిండారీల వంటి అరాచక దోపిడీ ముఠాలను మించి విశాఖలో భూదందా సాగింది. కార్యనిర్వాహక రాజధాని ముసుగులో వైసీపీ జగజ్జంత్రీలు విశాఖను చప్పరించేశారు. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 7వేల 950 కోట్ల విలువైన భూముల్ని వశపరుచుకున్నారు. వెలుగులోకి రాని వాటి విలువ మరికొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:28 AM IST

Visakhapatnam Destruction
Visakhapatnam Destruction

అనాథాశ్రయం నుంచి ప్రార్థనాలయాల వరకూ - నంబర్ వన్, నంబర్ 2 కావాలనుకుంటే ఏదైనా మటాష్

Visakhapatnam Destruction: ప్రజాదర్బార్‌! ప్రజల సమస్యలు అర్జీల రూపంలో స్వీకరించేందుకు గతంలో ప్రభుత్వాలు నెలకొల్పిన మంచి వ్యవస్థ! దాన్నే విశాఖలో భూదందాకు స్కెచ్‌గా మార్చేసుకున్నారు వైసీపీ పెద్దలు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ అప్పట్లో వైసీపీలో నంబర్‌-2గా ఉన్న నేత అక్కడ తిష్ట వేశారు. తన సొంత కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించేవారు. భూవివాదాలపై ఫిర్యాదులు వస్తేచాలు! అర్జీపెట్టుకున్నవారీని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేవారు. మేం చెప్పిన ధరకు భూమి మాకు ఇస్తే సరి లేదంటే ఆ భూమి నీకు దక్కదని బెదిరించేవారు. కొన్ని భూములపై వాళ్ల మనుషులతోనే కోర్టుల్లో కేసులువేయించి, న్యాయవివాదాలు సృష్టించారు. అడిగినంత వాటా ఇవ్వాలని బేరం పెట్టారు. ఎవరైనా విలువైన భూములు కొనుగోలు చేస్తే, ఆ భూమి మాకు అమ్ముతానంటూ ఒప్పందం ఉందని బెదిరించేవారు. సెటిట్మెంట్‌ పేరుతో ఎంతోకొంత లాగేసేవారు.

నంబర్ 2, నంబర్‌ 1 దందా:వైసీపీలో నంబర్‌2-గా పెత్తనం చెలాయించిన నేత మూడేళ్లకుపైనే విశాఖలో అక్కడ సమాంతర ప్రభుత్వ సారథిగా వ్యవహరించారు! ఆయన బంధువులు, బినామీలు అక్కడ భారీగా ఆస్తులు కూడగట్టారు. ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొన్ని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని 25 సర్వే నెంబర్లలో 87 వేల 714 చదరపు గజాల స్థలాన్ని అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ భూములు పోగేసింది. 2021 ఫిబ్రవరిలో మొదలు పెట్టి 11 నెలల వ్యవధిలో చకచకా కొనేసింది. అప్పట్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ భూముల విలువ 53కోట్లు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ ఎన్నో రెట్లుంటుంది! ప్రతిపాదిత భోగాపురం బీచ్‌కారిడార్‌ రోడ్డు నేరెళ్ల వలస దగ్గర వంపు తిరిగిన ప్రాంతాన్ని ఆనుకునే ఆ భూములు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఆ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారు.

ఇక విశాఖలో విలువైన దసపల్లా భూములూ రసగుల్లలా మింగేసిందీ వైసీపీ బంధుగణమే! దసపల్లా భూములు అష్యూర్‌ డెవలపర్స్‌ వశమయ్యాయి. ఆ సంస్థ భాగస్వామి ఎవరోకాదు వైసీపీలో నెం-2 నేతకు అత్యంత సన్నిహితుడైన వస్త్రవ్యాపారి గోపీనాథరెడ్డి. దసపల్లా భూముల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిధులు అవ్యాన్‌ రియల్టర్స్‌ నుంచే అష్యూర్‌ సంస్థకు వెళ్లాయన్న ఆరోపణలున్నాయి. మధురవాడలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పేరుతో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో 126వ నెంబరు విల్లా స్థలాన్ని అవ్యాన్‌ సంస్థకు రిజిస్ట్రేషన్‌ చేశారని, ప్రాజెక్టుకి అనుమతులు పొందేందుకు నెం.2 నేతకు కట్టాల్సిన కప్పం కట్టారని జనసేన నేత మూర్తియాదవ్‌ ఆరోపించారు. అవ్యాన్‌కు 5వేల 87 చదరపు గజాల స్థలాల్ని 2021 ఏప్రిల్‌లో రిజిస్టర్‌ చేస్తే, అదే ఏడాది జూన్‌లో ఆ సంస్థ చేపట్టే నిర్మాణాలకు అనుమతులిచ్చేశారు.

8 వేల 844 ఎకరాలను గద్దల్లా తన్నుకుపోయిన జే గ్యాంగ్​ - లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌తో ఉద్యోగాలంటూ బురిడీ

రేడియెంట్‌ భూములు ఎంపీ కంపెనీ చేతికి!: ఇక రుషికొండ ప్రాంతంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూములు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అక్కడి నుంచి జగన్‌ సోదరుడు అనిల్‌ రెడ్డి చేతుల్లోకి వెళ్లడం నిజంగా భూమాయే. వేమిరెడ్డి, అనిల్‌రెడ్డిలో ఒకరు ఇటీవల తన భాగస్వామికి 175 కోట్ల రూపాయలు చెల్లించి ఆయనను బయటకుపంపించి, మొత్తం ప్రాజెక్టు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఆ భాగస్వామికి రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ప్రాజెక్టు పూర్తవ్వకుండానే అప్పనంగా 175 కోట్లు వచ్చిందన్నమాట. ఈ ప్రాజెక్టులో 10 ఎకరాలను సాగరతీరం కనిపించే వైపు ‘ముఖ్యనేత’కు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఆ భూముల్ని రుషికొండలో రేడియంట్‌ అనే సంస్థకు 2005లో అప్పటి YS రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భూములు కేటాయించింది.

దీనిపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. పలువురు కేసులు కూడా వేశారు. చివరకు ఆ సంస్థ ఆర్బిట్రేషన్‌ సెటిల్‌మెంట్ కింద వుడాకు 90 కోట్లు చెల్లించేలా ఆ భూముల్ని వుడాకు అప్పగించేలా 2019లో ఒప్పందం జరిగింది. వైసీపీ అధికారంలోకొచ్చాక ఆ భూముల్ని రేడియెంట్‌ సంస్థ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన VPR సంస్థకు డెవలప్‌మెంట్‌కి ఇచ్చేసింది. ఈ డీల్‌ జరగడానికి ముందు రేడియెంట్‌ సంస్థ చెల్లించాల్సిన 46 కోట్ల స్టాంప్‌ డ్యూటీకి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ భూములకు సంబంధించి కనీసం మూడేళ్ల కాలానికి 9 కోట్ల వరకు ఖాళీ స్థలాల పన్ను చెల్లించాల్సి ఉండగా, 6 కోట్ల రూపాయలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వేమిరెడ్డికి చెందిన VPR ప్రాజెక్టు ఆ భూముల్లో విల్లాలు నిర్మిస్తుండగా, ఆ ప్రాజెక్టు ఇప్పుడు జగన్‌ సోదరుడు అనిల్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ 50 ఎకరాల విలువ వెయ్యి కోట్లని అంచనా!

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

గద్దల్లా తన్నుకుపోయారు: విశాఖలో 15 వందల కోట్ల రూపాయల విలువైన ఎన్​సీసీ భూములనూ వైసీపీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారు. మధురవాడలో ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డుకి చెందిన 97 ఎకరాల భూమిని ఎన్​సీసీ సంస్థ 2005లో బిడ్డింగ్‌లో దక్కించుకుంది. కానీ 2013 వరకూ అక్కడ ఎలాంటి కార్యకలాపాలూ ప్రారంభించలేదు. అప్పటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసి, భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించగా, ఎన్​సీసీ సంస్థ కోర్టుకెళ్లి స్టేటస్‌కో తెచ్చుకుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం కొన్ని షరతులతో ఆ భూమిని మళ్లీ ఎన్​సీసీకి అప్పగించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దల కన్ను ఆ భూములపై పడింది. తెరవెనుక మంత్రాంగం నడిచింది.

ఎన్​సీసీ సంస్థ 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్ బోర్డుకు 11.5 శాతం వాటా ఇవ్వాలని గత ఒప్పందంలో ఉన్న నిబంధన తొలగించారు. అంటే ఆ ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేకుండా, మొత్తం ప్రైవేటుపరం చేసేశారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుని ఎన్​సీసీ సంస్థ నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్​పీఎల్​ సంస్థ దక్కించుకుంది. అక్కడ రిజిస్ట్రేషన్‌ విలువను చదరపు గజాల్లో లెక్కిస్తున్న ప్రభుత్వం, ఎన్​సీసీకి మాత్రం ఎకరాల్లో రిజిస్ట్రేషన్‌ ధరలు నిర్ణయించడంతో పాటు, బాగా తగ్గించేసింది. అలా ఎన్​సీసీకి చెందిన సుమారు 15 వందల కోట్ల విలువైన 97.30 ఎకరాల భూమి మంత్రి కొట్టు సోదరుడికి చెందిన జీఆర్​పీఎల్​ దక్కించుకుంది. కాకపోతే ఇక్కడ తెరముందు కనిపించేంది జీఆర్​పీఎల్​ సంస్థే అయినప్పటికీ తెరవెనుక మొత్తం నడిపిస్తోంది వైసీపీ పెద్దలేననే ఆరోపణలున్నాయి.

విజయనగరంలో సెటిల్​మెంట్ల దందా - ఆ నేత కన్నుపడితే ఆశలు వదులుకోవాల్సిందే

హయగ్రీవ భూములపై పడిన కన్ను: విశాఖలో వృద్ధుల పేరుతో తీసుకున్న ప్రాజెక్టు కూడా విచిత్రంగా వైసీపీ నేతల పరమైంది. వృద్ధులకు నివాస గృహాలు వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. అక్కడ కట్టే ఇళ్లు వృద్ధులకు మాత్రమే విక్రయించాలన్నది నిబంధన. ఆ భూమిలో జగదీశ్వరుడు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టలేదు. గత ప్రభుత్వాలు భూకేటాయింపుల రద్దుకు ప్రయత్నించగా, ఆయన కోర్టులకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకునేవారు. అధికారంలోకొచ్చాక వైసీపీ నాయకుల కన్ను హయగ్రీవ భూములపై పడింది.

జగదీశ్వరుడు మొదట గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తికి హయగ్రీవ సంస్థలో 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని జగన్‌కు సన్నిహితంగా ఉన్న ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు-జీవీ పేరిట జీపీఏ చేశారు! వీఎంఆర్​డీఏ, నుంచి అనుమతుల్లేకుండానే ఆ భూమిని 30 మందికి వెయ్యి గజాలు చొప్పున అమ్మేశారు. ఆ భూముల్లో ఒక వైసీపీ ఎమ్మెల్యేకి రెండు ప్లాట్లు, రాజ్యసభ సభ్యుడికి ఒక ప్లాటు కేటాయించినట్టు తెలుస్తోంది! వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీ తన నుంచి ఆ భూమిని బలవంతంగా చేజిక్కించుకున్నారని జగదీశ్వరుడు 2021లో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత వారికి రాజీ కుదిరింది. హయగ్రీవ ప్రాజెక్టుకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునతోనే ఆ ప్రాజెక్టుకి అన్ని అనుమతులివ్వాలంటూ నిరభ్యంతర పత్రం జారీ చేయించారు. ఈ భూముల విలువ కూడా వెయ్యి కోట్లపైమాటే.

రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు కూడా: రుషికొండ వద్ద బేపార్క్‌ పేరుతో 5 నక్షత్రాల హోటల్‌ను తలదన్నేలా నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీన్ని జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటెరో సంస్థ నిర్వహిస్తోంది. బేపార్క్‌ పేరును పెమా వెల్‌నెస్‌ సెంటర్‌గా మార్చింది. ప్రముఖ సినీతారలు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు, ధనవంతులు అక్కడ చికిత్సతోపాటు సేదతీరేందుకు వస్తుంటారు. ఆ ప్రాజెక్టు నిమిత్తం ఒక ప్రైవేటు వ్యక్తికి 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొండపై 28 ఎకరాలు సముద్ర తీరాన్ని ఆనుకుని మరో 5.75 ఎకరాలు కలిపి మొత్తం 33.75 ఎకరాల్ని 33 ఏళ్లపాటు లీజుకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏటా 10 లక్షల రూపాయలు లీజు చెల్లించాలన్నది ఒప్పందం. వైసీపీ అధికారంలోకి వచ్చాక కీలక నేత కుమారుడు దక్కించుకున్నారు. ఇటీవల సర్దుబాటు కావడంతో ఆ ప్రాజెక్టు మల్లీ పాత యజమానుల చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం గడువు ముగిసేలోగా ఈ ప్రాజెక్టు లీజుని 99 ఏళ్లకు పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

'రామానాయుడు' భూముల్లోనూ:విశాఖలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూముల్లోనూ కొంత కాజేశారు. 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కొండపై 34.44 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత భాగంలో స్టూడియో నిర్మించగా, ఖాళీగా ఉన్న భూములపై వైసీపీ నేతల కన్ను పడింది. ఆ భూముల్లోని 15.18 ఎకరాల్లో లేఅవుట్‌లు వేసి విక్రయించేందుకు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ అనుమతులిచ్చేసింది. కొండపైన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతివ్వడం నిబంధనలకు విరుద్ధం. ఐనా ఇచ్చేశారు. మొదట్లో మొత్తం స్టూడియో భూముల్ని కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్చేశారు! చివరకు ఇప్పుడు వేస్తున్న లేఅవుట్‌లో సముద్రానికి అభిముఖంగా ఉండే కొన్ని బ్లాక్‌లను ‘ముఖ్యనేత’కు కట్టబెట్టేందుకు అంగీకారం కుదరడంతో లేఅవుట్‌కి అనుమతి ఇచ్చారనే ప్రచారం జరిగింది. లేఔట్‌ ప్రతిపాదిత 15.18 ఎకరాల విలువ 250 కోట్ల వరకూ ఉంటుంది.

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా - వివాదాలుంటే సెటిల్మెంట్ ! మాట వినికపోతే బదిలీలు, కేసులు - తండ్రి అడుగు జాడల్లో కుమారుడి అక్రమాలు!

2 వేల కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాలు: ఇక దసపల్లా భూముల్లో 2 వేల కోట్ల రూపాయల విలువైన మరో 15 ఎకరాలు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ భూముల్ని కాజేసేందుకు మధ్యలో ఉన్న రహదారిని అవసరం లేకపోయినా విస్తరింపజేశారు. టీడీఆర్ బాండ్ల పేరుతో మరో వెయ్యి కోట్ల రూపాయలకు టెండర్‌ పెట్టారు. గత ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా నిషిద్ధ జాబితాలో ఉంచి కాపాడుతూ వచ్చిన భూముల్ని జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి లేఖ రాయించారు. అలా నిషిద్ధ జాబితా నుంచి తొలగింపజేశారు. అక్కడ విజయసాయి సన్నిహితులు భారీ గృహ, వాణిజ్య భవనాల నిర్మాణ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు.

విశాఖలో రెండుదశాబ్దాల క్రితం చేపట్టిన కార్తీకవనం ప్రాజెక్టూ వైసీపీ అధికారంలోకొచ్చాక చేతులు మారింది! కైలాసగిరి-రుషికొండ మధ్యనున్న ఎండాడలో కార్తీకవనం పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు చేపడతామంటూ అప్పటి విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-వుడా అటవీశాఖ నుంచి 4.1 ఎకరాలు తీసుకుంది. వుడా నుంచి కొందరు ఆభూములు లీజుకి తీసుకుని తాత్కాలిక నిర్మాణాలతో హోటల్‌ వంటిది నడిపారు. 2014లో ఎంఏజీ లీజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ అక్కడ పర్యావరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామంటూ వుడా నుంచి వీఎంఆర్​డీఏతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. సీఆర్​జెడ్ పరిధిలోకి వచ్చే ఆ భూమిలో అటవీ, పర్యావరణశాఖ నిబంధనల ప్రకారం సిమెంట్, కాంట్రీట్‌తో శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. ఎంఏజీ లీజర్స్‌ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విలాసవంతమైన హోటల్‌ నిర్మాణం చేపట్టింది. వైసీపీ ఏలుబడిలోఅది, పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది! దీని విలువ 400కోట్ల రూపాయలని అంచనా.

కన్నుపడితే ఖతమే! - అధికార పార్టీ అండతో కలెక్టరేట్​లో భూ దస్త్రాలు తారుమారు

సేవ ముసుగులోనూ: సేవ ముసుగులోనూ కోట్లు విలువ చేసే భూముల్ని అయినవారికి అప్పజెప్పారు. రుషికొండలో 300 కోట్ల రూపాయల విలువైన భూమి వైఎస్సార్‌ సోదరి విమలారెడ్డి సందేశాలిచ్చే 'సెయింట్ లూక్స్‌' అనే మైనార్టీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధీనంలో ఉంది. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో 2009లో ఆ సంస్థకు 7.35 ఎకరాలు కేటాయించారు. ఎకరం కోటిన్నరకు ఇవ్వొచ్చని కలెక్టర్‌ సిఫారసు చేస్తే ఆ సంస్థకు 25 లక్షల రూపాయలకే ఎకరం భూమి చొప్పున కేటాయించారు. క్రైస్తవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల సాధికారతకు నర్సింగ్ శిక్షణ ఇస్తామని ఆస్పత్రి నిర్మించి పేదలకు వైద్యం అందిస్తామంటూ ఆ సంస్థ భూములు తీసుకుంది. ఇంత వరకు అక్కడ ఎలాంటి ఆస్పత్రిని నిర్మించలేదు. ప్రార్థన మందిరాన్ని మాత్రం కట్టేశారు. విమలారెడ్డి అక్కడికి వస్తూ సందేశాలు ఇస్తుంటారు. ఆ భూమిలోని కొంత భాగంలో షెడ్డు వేసి అక్కడ నర్సింగ్ శిక్షణ ఇస్తున్నారు.

ఎంపీ భూ దందా: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ అండ్‌ ఎంకే హౌసింగ్‌ సంస్థ కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న ఆ భూములకు సంబంధించి 11 మంది యజమానులతో 2018 జనవరి 8న ఎంవీవీ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీతో కూడిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ 11 మందీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో ఎంవీవీ 15 లక్షల చదరపుఅడుగుల నిర్మితప్రాంతం కల్గిన అపార్ట్‌మెంట్లు నిర్మించారు. కానీ స్థల యజమానులు 11 మందికీ కామన్‌ ఏరియాతో కలిపి మొత్తం 14 వేల 400 చదరపు అడుగులు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.

అంటే 51 వేల 159 చదరపు గజాల స్థలంలో.. భూ యజమానికు వచ్చే అవిభాజ్య వాటా కేవలం 490 చదరపు గజాలే! డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లోనే అక్కడ చదరపు గజం విలువ 18 వేలుగా పేర్కొన్నారు. ఎకరా 50 కోట్లు లెక్కేసినా అది కనీసం 500 కోట్ల రూపాయల విలువైన స్థలం. అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది కేవలం 0.96 శాతమే! ఆ భూములపై యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని ఎంవీవీ వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగతా భూములు సొంతం చేసుకున్నారు.

ప్రశ్నిస్తే 'దుస్తులూడదీసి కొడతాం' - సామాన్యుల ఆస్థులు ఆక్రమిస్తూ వైసీపీ నాయకుల బెదిరింపులు

చర్చికి చెందిన 500 కోట్ల విలువైన స్థలాన్నీ: విశాఖ నడిబొడ్డున సీబీసీఎన్​సీ చర్చికి చెందిన 500 కోట్ల విలువైన స్థలాన్నీ ఎంపీ ఎంవీవీ బినామీ సంస్థ పేరుతో కొట్టేశారనే ఆరోపణలున్నాయి. సిరిపురంలో సీబీసీఎన్​సీ చర్చికి సర్వే నెంబరు 75లో 19 వేల గజాల స్థలం ఉంది. దాని మార్కెట్‌ విలువ 500 కోట్లపైమాటే. 1993వ సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ ప్రకారం 18 సంస్థల యజమానులకు దానిలో వాటాలున్నాయి. దానిపై నేటికీ అనేక కేసులున్నాయి. ఆదిత్య డెవలపర్స్‌ అనే ఎంవీవీ బినామీ సంస్థ స్థల యజమానుల్ని బెదిరించి వారికి 30 శాతం, డెవలపర్‌కు 70 శాతం వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా రహదారుల విస్తరణలో స్థలం పోతే వాటి యజమానులకు ప్రభుత్వం టీడీఆర్​ బాండ్లు ఇస్తుంది. కానీ సీబీసీఎన్​సీ భూములకు సంబంధించి స్థలం పోకముందే భూ యజమానులతో దరఖాస్తు చేయించి 60 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్​ బాండ్లను ఆగమేఘాల మీద జారీ చేశారు.

విశాఖలో వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకున్న ప్రతి ప్రాజెక్టుకి సంబంధించిన లావాదేవీ ‘ముఖ్యనేత’ సమ్మతితోనే జరుగుతోందని ప్రతి ప్రాజెక్టులోను ఆయనకు 20 శాతం ముట్టజెప్పాల్సిందేనని సమాచారం. విశాఖలో వైసీపీ నాయకులు అంతగా చెలరేగిపోతున్నా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని చెరబడుతున్నా ఆయన ఏమీ మాట్లాడకపోవడానికి అదే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటూ హడావుడి చేసి ఆ ముసుగులో అక్కడి విలువైన భూములన్నీ కొట్టేయడం వెనుక ఆ ‘ముఖ్యనేత’ మాస్టర్‌మైండ్‌ ఉందనే ఆరోపణలున్నాయి.

YSRCP Leader Anarchists in Tirupati District: కన్నుపడిందంటే అంతే.. ఆయన ముందు రాహుకేతువులైనా దిగదుడుపే..

ABOUT THE AUTHOR

...view details