తెలంగాణ

telangana

ఈ నెల 15న మూడో విడత రుణమాఫీ : మంత్రి తుమ్మల - Tummala Comments On loan waiver

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 2:44 PM IST

Updated : Aug 6, 2024, 4:41 PM IST

Tummala Comments On loan waiver : రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలు సరి కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆగస్టు 15న సీఎం రేవంత్‌ రెడ్డి మూడో విడత రుణమాఫీని ప్రారంభిస్తారని వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tummala Comments On loan waiver
Tummala Comments On loan waiver (ETV Bharat)

Tummala Allegations On Opposition Parties: ఈ నెల 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. స్వాతంత్ర్య వేడుకల రోజున వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీని ప్రారంభిస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాల విడుదల కార్యక్రమానికి సంబంధించిన సభలోనే రుణమాఫీ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. మూడో విడతలో సుమారు 6 వేల మంది రైతులకు, దాదాపు రూ.6 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే సాంకేతిక కారణాల వల్ల రెండు విడతల్లో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లన్నీ సరి చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు, అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందలేరని వ్యాఖ్యానించారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్న ఆయన, రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనోభావాలను దెబ్బ తీయవద్దని హితవు పలికారు.

ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తాం. వైరాలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు. సాంకేతికంగా ఇబ్బందుల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. పొరపాట్లు అన్నీ సరి చేసి అర్హులు అందరికీ రుణమాఫీ చేస్తాం. - తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి

ఈ నెల చివరి కల్లా రూ.24 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti khammam Tour

రాహుల్ గాంధీ వరంగల్‌ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తోందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులను రుణాల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాస్‌బుక్‌ లేకపోయినా, తెల్లకార్డు ద్వారా రుణాలు మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. మాఫీ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాంకేతిక కారణాల వల్ల కొన్ని రుణాలు మాఫీ కాలేదని, వాటిని పరిష్కరించి రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

' గత ఐదు సంవత్సరాలుగా తీసుకున్న రైతు రుణాలకు సంబంధించి ఖాతాల వివరాలు 32 బ్యాంక్​లు పంపించాయి. ఇప్పటివరకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ వర్తింపజేశాం. మేము చెప్పినట్లుగా పూర్తిగా రైతు మాఫీ చేసి తీరుతాం. బ్యాంక్ తప్పిదాలు, ఆధార్ ఖాతాలో తప్పులు, సాంకేతిక సమస్యల వల్ల కొందరి ఖాతాలో డబ్బులు పడలేదు. అలాంటి వారికి సైతం రుణమాఫీని వర్తించేలా చర్యలు చేపడతాం.' - తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి

ఆ ఆలోచన లేదు : పంటల బీమా ఈ ఏడాది అమలు చేస్తామని, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని మంత్రి వివరించారు. సాగులో లేని భూములకు పొందిన రైతుబంధు రికవరీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తుమ్మల తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటం వల్ల వ్యవసాయానికి మంచి పరిస్థితులు నెలకొన్నాయని, ఎరువులు, యూరియా పూర్తిస్థాయిలో పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

'మీకు లక్షన్నర రుణమాఫీ కాలేదా? - ఐతే ఈ నంబర్​కు వాట్సాప్ చేయండి' - NIRANJAN REDDY ON CROP LOAN WAIVER

Last Updated : Aug 6, 2024, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details