తెలంగాణ

telangana

ఓ సినీ నిర్మాత స్వీయ దర్శకత్వంలో - ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల 'స్కామ్​ కథాచిత్రం' - TELUGU FILM PRODUCER FRAUD

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 9:56 AM IST

Bank Manager Fraud In Shamshabad : పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు. ఓ సినీ నిర్మాతతో చేతులు కలిపి బ్యాంకుకు రూ.40 కోట్లు టోపీ పెట్టారు. ఈ ఘటన శంషాబాద్​లో జరిగింది. నగదును దొడ్డిదారిలో బదిలీ చేసుకున్న ఈ కేసును ఈవోడబ్లూ పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధానసూత్రధారైన సినీ నిర్మాత, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.

Bank manager fraud In Shamshabad
Bank manager fraud In Shamshabad (ETV Bharat)

Bank Manager Fraud In Shamshabad : ఓ సినీ నిర్మాత తెరవెనుక నుంచి ఒక నేరానికి దర్శకత్వం వహించారు. బ్యాంకు ఉద్యోగులు పాత్రధారులుగా మారారు. పని చేస్తున్నసంస్థకు రూ.40 కోట్లకు కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో 40 కోట్ల నగదును దొడ్డిదారిలో బదిలీ చేసుకున్న కేసును సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు చేధించారు. తెలుగులో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించిన బషీద్‌ దీనికి ప్రధాన సూత్రధారి కాగా శంషాబాద్‌లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు మేనేజర్, ఉద్యోగి డబ్బు కొట్టేసినట్లు తేల్చారు. నిందితులు ముగ్గుర్నీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారంఆర్థిక మోసాల్లో ఆరితేరిన బషీద్‌ డబ్బు కోసం శంషాబాద్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కె.రామస్వామితో కలిసి పథకం వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశచూపాడు. రామస్వామి, రాజేశ్‌ ఇద్దరూ కలిసి ఆదిత్య బిర్లా సంస్థ ఖాతాలోని రూ.40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్‌ ఆ డబ్బును మరిన్ని ఖాతాలకు బదిలీ చేశాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు బషీద్‌ రెండు కార్లు కొన్నాడు. తన మోసానికి సహకరించిన రామస్వామికి కారును బహుమతిగా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

ఎలా అనుమానం వచ్చిందంటే :ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబయి నారీమన్‌పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. సంస్థ అనుమతి లేకుండానే ఖాతా నుంచి జులై 12వ తేదీ నుంచి రూ.40 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. ఈ సొమ్మును కుకునూరు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉన్న ఖాతాకు రూ.25 కోట్లు, రూ.15 కోట్ల చొప్పున బదిలీ అయ్యాయి.

ఉదయ్‌కుమార్‌ లావాదేవీ జరగడానికి 8 రోజుల ముందే ఖాతా తెరవడం గమనార్హం. అనుమానాస్పద లావాదేవీ కావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ బ్రాంచి మేనేజర్‌ కనుగుల రామస్వామి, బ్యాంకు ఉద్యోగి ఎస్‌.రాజేశ్‌ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు తేలింది.

విధులకు డుమ్మా కొట్టి :ఇదే సమయంలో జులై 15వ తేదీ నుంచి బ్యాంకు మేనేజర్‌ రామస్వామి విధులకు హాజరవ్వడం లేదు. ఫోన్, ఇతర మార్గాల ద్వారా సంప్రదించినా ఆచూకీ చిక్కలేదు. అనుమానమొచ్చిన బ్యాంకు అధికారులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు రామస్వామి, రాజేశ్‌ను ఈ నెల 24వ తేదీన అరెస్టు చేశారు. వారిని లోతుగా ఆరాతీయగా వారి వెనుక తెలుగు సినీ నిర్మాత బషీద్‌ ఉన్నట్లు బయటపడింది.

Key Mastermind In The Case :కేసులో కీలక సూత్రధారిగా ఉన్న హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌కు చెందిన షేక్‌ బషీద్‌ తెలుగులో అనేక చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మించాడు. హైదరాబాద్‌ సీసీఎస్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, బోయిన్‌పల్లి, నార్సింగి, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్లలో 10 చీటింగ్‌ కేసులున్నాయి. నిందితుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏపీలోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు.

ఖాతాదారులను మోసం చేసిన బ్యాంక్‌ మేనేజర్‌ - రూ.5 కోట్లు స్వాహా - Bank manager fraud in Nizamabad

తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్ - మాజీ సీఎస్ సోమేశ్ కుమార్​పై కేసు నమోదు - SOMESH KUMAR GST SCAM IN TELANGANA

ABOUT THE AUTHOR

...view details