TIRUPATI STAMPEDE INCIDENT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏం జరిగింది: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్ పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.
తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్లోకి తరలించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు.
రుయా, స్విమ్స్ ఆసుపత్రులలో క్షతగాత్రులు:క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు.