ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిక్కిరిసిన తిరుమల గిరులు- గరుడ వాహనంపై శ్రీనివాసుడి వైభవం

గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

Tirumala Brahmotsavam 2024
Tirumala Brahmotsavam 2024 (ETV Bharat)

Tirumala Garuda Vahana Seva 2024 : తిరుమలేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను తన్మయపరిచారు. గర్భాలయంలో మూలవర్లకు సదాసమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదుపేట్ల సహస్రనామం, మకరకంఠి అభరణాలు ధరించిన శ్రీనివాసుడు తిరుమాఢ వీధుల్లో విహరించారు. వాహనం ముందు గజరాజులు నడవగా, జీయ్యంగార్లు స్వామినికీర్తిస్తుండగా, భక్త బృందాలు భజనలు, కోలాటాలతో నేత్రపర్వంగా సాగింది.

ఉదయాన్నే నిండిన గ్యాలరీలు : వేంకటేశుడి వైభవాన్ని చూసేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. 221 గ్యాలరీలు కిక్కిరిశాయి. గ్యాలరీలు గోవింద నామ స్మరణతో మార్మోగాయి. స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఆ దేవదేవుడికి కర్పూరహారతులు పట్టారు. మంగళవారం రాత్రి ఆరున్నరకు ప్రారంభమైన గరుడసేవ అర్థరాత్రి దాకా సాగింది. మంగళవారం ఉదయం నుంచే గ్యాలరీల్లోకి భక్తుల్ని అనుమతించగా మధ్యాహ్నానికే దాదాపు 2 లక్షల మంది భక్తులు నిండిపోయారు. వారందరూ తనివితీరా స్వామివారిని దర్శించుకున్నారు.

వాహనం తూర్పు మాఢవీధి దాటాక, అప్పటి వరకూ గ్యాలరీల్లో ఉన్న భక్తుల్ని బయటకుపంపి మళ్లీ కొత్త భక్తులతో నింపడంతో ఎక్కువ మందికి దగ్గర నుంచి స్వామివారి దర్శన భాగ్యం దక్కింది. టీటీడీ అమలు చేసిన కొత్త విధానం సత్ఫలితాన్నిచ్చింది. భక్తుల ఆకలి తీర్చేలా రాత్రి 1 గంట వరకూ అన్నప్రసాద కేంద్రాన్ని తెరిచి ఉంచారు. వారికోసం 4 లక్షల వాటర్‌ బాటిళ్లు, 3 లక్షల చొప్పున మజ్జిగ, బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల ఘాట్ రోడ్​లో 24 గంటల పాటు బస్సులను నడిపారు.

Tirumala Brahmotsavam 2024 :మరోవైపు భ‌క్తులకు అందుతున్న సేవలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌద‌రి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి గ్యాలరీలను పరిశీలించారు. భ‌క్తులకు అందజేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టీటీడీ అధికారులు సమన్వయంతో గరుడవాహన సేవను దిగ్విజయం చేశారు. ఈరోజు సాయంత్రం స్వామివారికి రథోత్సవం, రాత్రికి గజ వాహన సేవ జరగనున్నాయి.

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు - సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి దర్శనం

హనుమ వాహనంపై కోదండ రామయ్యగా శ్రీవారు- విహరించేది అందుకే!

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details