తెలంగాణ

telangana

నేటితో ముగియనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పదవీ కాలం - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ - State Election Commission Candidate

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 7:17 AM IST

Updated : Sep 8, 2024, 8:04 AM IST

Government To Appoint New State Election Commission : రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఆయనను మరో ఏడాది కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్నది వేచి చూడాలి. కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్ఈసీ నియామకం కీలకం కానుంది.

New State Election Commission
State Election Commission (ETV Bharat)

State Election Commission : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీ కాలం నేటితో పూర్తి కానుంది. 2020 సెప్టెంబర్ 9న ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 8తో పదవీ కాలం పూర్తైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్థసారధి పదవీ కాలాన్ని అప్పట్లో ఏడాది పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం నేటితో ముగియనుంది.

పార్థసారధి పదవీకాలం : 2020 సెప్టెంబర్ 9 నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా ఉన్న పార్థసారధి గత నాలుగేళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మరో ఏడాది పాటు ఎస్ఈసీగా కొనసాగేందుకు ఆయనకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్థసారధిని మరో ఏడాది పాటు కొనసాగిస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన్ను కొనసాగించకపోతే కొత్త కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ :గ్రామ పంచాయతీలు మొదలు, జిల్లా పరిషత్‌ల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది. ఈ నెల 13న ముసాయిదా ప్రచురించి, కసరత్తు పూర్తి చేసిన తర్వాత 28న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్త కమిషనర్‌ను నియమించాల్సి వస్తే ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై సర్కార్ దృష్టి సారించినట్లు సమాచారం. 2020 తర్వాత పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారుల పేర్లను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి నేడు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి: ప్రధాన ఎన్నికల అధికారి

పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్దం చేయండి - అధికారులకు ఎస్ఈ​సీ ఆదేశం - SEC Meeting on Panchayat Elections

Last Updated : Sep 8, 2024, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details