ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో టెస్లా యూనిట్​ ​​- ఆ జిల్లాలకే ఎక్కువ ఛాన్స్ - పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ - TESLA MANUFACTURING UNIT TO AP

భారత్​లో కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు టేస్లా ఆలోచన- ఆ ఛాన్స్​ ఏపీకీ దక్కేనా?

tesla_for_ev_manufacturing_unit_in_andhra_pradesh
tesla for ev manufacturing unit in andhra pradesh (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 7:18 AM IST

Tesla EV Manufacturing Unit in Andhra Pradesh :అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ‘టెస్లా ’ కార్ల తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలన్నది సంస్థ ఆలోచన. కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధి బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపగా పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అయితే ఇప్పటికే సేకరించిన భూములు ఉండటం రాష్ట్రానికి సానుకూలాంశం కానుంది.

టెస్లా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదనపై చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై టెస్లా ప్రతినిధి బృందం కొన్ని ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కీలక సమావేశం జరగాల్సి ఉందని. ఆ తర్వాత ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సంస్థ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించొచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇందులో ప్రధాన నేత నిర్ణయమే కీలకం కానుంది.

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్‌ టెక్సస్‌లోని టెస్లా సంస్థ ప్రతినిధులను కలిసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వం కూడా పలుమార్లు టెస్లా సంస్థకు లేఖలు రాసింది. వర్చువల్‌ విధానంలోనూ చర్చించింది. రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలిసింది. దిగుమతి చేసుకునే కార్లపై కేంద్రం సుమారు 110 శాతం సుంకాలు విధిస్తోంది. దీనివల్ల కారు ధర భారీగా పెరుగుతోంది. దేశంలో తయారీ యూనిట్‌ ఏర్పాటు ద్వారా సుంకాల భారాన్ని తగ్గించుకోవాలన్నది టెస్లా ఆలోచన.

టెస్లా వస్తే పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇమేజ్‌ వస్తుంది. అందుకే వివిధ రాష్ట్రాలు దీనికోసం పోటీపడుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో టెస్లా ఇండియా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ కార్ల తయారీ యూనిట్‌నూ ఇక్కడే ఏర్పాటు చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడా ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్, ఇప్పటికే వివిధ ప్రముఖ కార్ల తయారీ యూనిట్లున్న తమిళనాడు కూడా టెస్లా పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నిస్తున్నాయి.పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్న తర్వాత భూసేకరణ, పునరావాసం వంటి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే సమయం వృథా అవుతుందని, ఇప్పటికే సేకరించిన భూములుంటే మేలని టెస్లా భావిస్తోంది.

టెస్లా భారత్​కు వస్తోందా?- ఇది ఎంతవరకూ నిజమంటే?

ఇలా భూములు సిద్ధంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సానుకూల అంశంగా చేసుకుని ముందుకెళుతోంది. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పరిశ్రమల కోసం ఇప్పటికే సేకరించిన సుమారు 15 వేల ఎకరాల్లో టెస్లాకు భూములను కేటాయించేలా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. శ్రీసిటీ, దానికి చుట్టుపక్కల భూములు ఇచ్చేందుకూ సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. కృష్ణపట్నం పోర్టు, ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం, తమిళనాడులోని చెన్నై పోర్టులు ఈ భూములకు దగ్గరలో ఉన్నాయి. వాటి ద్వారా విడిభాగాల దిగుమతికి అవకాశం ఉంటుందని దగదర్తి దగ్గర విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

టెస్లా ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ - పెట్టుబడుల వేటలో కీలక పరిణామం

ABOUT THE AUTHOR

...view details