తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 9:47 AM IST

ETV Bharat / state

మీ పాత ఫోన్​ను అమ్మేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్​లో పడ్డట్టే! - OLD PHONES SELLING TO STRANGERS

Police Warns People On Old Phones : మీ పాత సెల్​ఫోన్​ను అపరిచితులకు విక్రయిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అలా చేస్తే ఇబ్బందుల్లో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫాత సెల్​ఫోన్లను కొనుగోలు చేసి వాటి ద్వారా సైబర్​ నేరాలకు పాల్పడే ముఠాలను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పాత ఫోన్ అమ్మే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Police Warns People On Old Phones
Police Warns People On Old Phones (ETV Bharat)

Police Warns People On Old Phones :పాత సెల్‌ఫోన్‌ పనిచేయడం లేదని ముక్కూముఖం తెలియని వారికి అమ్మితే చిక్కుల్లో పడే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే సైబర్‌ నేరగాళ్ల చేతికి తాళం ఇచ్చినట్లేనని చెబుతున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్‌ నేరాలకు పాల్పడే ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నాయి.

బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం విధితమే. వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ముఠాను విచారించడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇలా పాత సెల్‌ఫోన్లు కొనుగోలు తంతు నడుస్తోందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

ఓ ముగ్గురి ముఠా బిహార్‌లోని ఖతిహార్‌ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అక్తర్‌అలీ సూచనతో పాత సెల్‌ఫోన్లు కొంటున్నట్లు తేలింది. తమ నుంచి కిలోల లెక్కన అక్తర్‌ వాటిని కొనుగోలు చేస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. అక్తర్‌ కోసం గాలిస్తున్నామని, అతడు దొరికితే ఈ దందాకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

మీ పేరుతోనే ఐఎంఈఐ నంబర్‌ :సాధారణంగా సెల్​ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్‌బోర్డు, ఐసీ, స్క్రీన్‌లాంటి ఉపకరణాలుంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. దీంతో అంతగా ఇబ్బంది లేకపోయినా మరో రూపంలో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు చెబుతున్నారు. పాత ఫోన్లలో డేటాను ఫార్మాట్‌ చేసి ఉండకపోతే ఇబ్బందులకు గురయ్యే ఆస్కారముంటుంది. వాటిలో పర్సనల్ చిత్రాలు, వీడియోలుంటే అవి సైబర్‌ నేరస్థుల ముఠాలకు చిక్కితే బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదముంది.

దీనికితోడు ఆయా ఫోన్లను సైబర్‌ నేరాలకు వినియోగిస్తే కొన్నిసార్లు దర్యాప్తు సంస్థలతో విచారణ ఎదుర్కొనే అవకాశాలుంటాయి. ప్రతి సెల్​ఫోన్‌కు ఒక ఐఎంఈఐ నంబరు ఉంటుంది. దీనినే ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌ అంటారు. ఎవరైనా మొబైల్​ను కొనుగోలు చేసినప్పుడు ఆ ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ వారి పేరిటే రిజిస్టరై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్‌ను దుర్వినియోగం చేసి ఎవరైనా సైబర్‌ నేరానికి పాల్పడితే దర్యాప్తు సంస్థల విచారణ సెల్​ ఫోన్‌ను అధికారికంగా కొనుగోలు చేసిన వారితోనే మొదలవుతుంది.

అందుకే సైబర్‌ కేటుగాళ్లు తెలివిగా ఇతరుల పేర్లపై ఉన్న సెల్‌ఫోన్లను, సిమ్‌కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా రామగుండం పోలీసులకు ఈ తరహా ముఠా చిక్కడంతో తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది సైబర్‌ నేరస్థుల ముఠాలు దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణాల దృష్ట్యా అపరిచితులకు పాత సెల్‌ఫోన్లను విక్రయించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు :

  • పాత ఫోన్‌ను అమ్మేముందు డేటాను బ్యాక్‌అప్‌ చేసుకోవాలి.
  • సెల్​ఫోన్​లోని డేటాను ఫ్యాక్టరీ రీసెట్‌ ఆప్షన్‌ ద్వారా పూర్తిగా తొలగించాలి. అలా చేయడం వల్ల ఇతరులు మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించి బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు అవకాశం ఉండదు.
  • అన్ని అకౌంట్లనుంచి నుంచి మీ ఫోన్‌ను డీరిజిస్టర్‌ చేయాలి.
  • గూగుల్‌ అకౌంట్‌ను సైన్‌అవుట్‌ చేయాలి. సెటింగ్స్‌లో యూజర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి రిమూవ్‌ అకౌంట్‌ బటన్‌ను క్లిక్ చేయాలి.

ఇవన్నీ చేసినప్పటికీ పాత సెల్‌ఫోన్‌ను అపరిచితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించరాదు. కొనుగోలుదారు నేరుగా మిమ్మల్ని సంప్రదించిన తర్వాతే విక్రయించాలి. వారి అడ్రస్‌ప్రూఫ్, ఫొటో, సెల్‌ఫోన్‌ను వారికి విక్రయించినట్లుగా సంతకం తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఫోన్‌ను ఉపయోగించి నేరానికి పాల్పడేందుకు ఆస్కారమనేది ఉండదు. ఒకవేళ కొనుగోలుదారులు ఆ ఫోన్‌తో ఏదైనా నేరం చేసినా పోలీసుల విచారణలో ఆయా వివరాలను వారికి సమర్పించి బయటపడొచ్చు.

'ఈ దొంగ స్టైలే వేరప్పా - డబ్బు ముట్టడు - బంగారం తాకడు - మొబైల్ ఫోన్లు మాత్రం వదలడు' - Mobile thief In Yellandu

సెల్​ఫోన్​ చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్ - రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details