Telangana Lok Sabha Election Polling Percentage :రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు కొలిక్కి వచ్చిన లెక్కల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 64.93 శాతం నమోదైంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు 9.51 శాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకొని 11 గంటలకు పోలింగ్ శాతం 24.31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్ పెరిగింది. ఇలా క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతానికి, సాయంత్రం 5 గంటలకు 61.16 శాతానికి పెరిగింది.
మావోయిస్టు ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ సుమారు 1400 బూత్లలో అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు రాత్రి వరకు ఓట్లు వేశారు.
హైదరాబాద్లో పోలింగ్ అత్యల్పం : ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం నమోదు అవ్వగా, అతి తక్కువగా హైదరాబాద్లో 46.08 శాతం పోలింగ్ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి కూడా పోలింగ్ తక్కువగానే జరిగింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం
- హైదరాబాద్ - 46.08 శాతం
- సికింద్రాబాద్ - 48.11 శాతం
- మల్కాజిగిరి - 50.12 శాతం
- ఆదిలాబాద్ - 72.96 శాతం
- చేవెళ్ల - 59.94 శాతం
- కరీంనగర్ - 72.33 శాతం
- ఖమ్మం - 75.19 శాతం
- మహబూబాబాద్ - 70.68 శాతం
- మహబూబ్ నగర్ - 71.54 శాతం
- మెదక్ - 74.38 శాతం
- నాగర్ కర్నూల్ - 68.86 శాతం
- నల్గొండ - 73.78
- నిజామాబాద్ - 71.50
- పెద్దపల్లి - 67.88
- వరంగల్ - 68.29
- జహీరాబాద్ - 74.54 శాతం