New Amberpet Flyover Opened For Motorists : హైదరాబాద్లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ పై నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్పేట్ ఫ్లై ఓవర్పై రాకపోకలు ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు ప్రయాణికుల సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు : ఈ మేరకు ఆయన మంగళవారం ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బుధవారం నుంచి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల దీని కోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.