KRMB Meeting On Krishna Water : ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం రేపు మళ్లీ జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి విడుదల కోసం బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. ఆన్ లైన్ విధానంలో హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ హాజరు కాలేదు.
సమావేశానికి ఏపీ అధికారులు గైర్హాజరు : సమావేశానికి ముందు నల్గొండ, ఒంగోలు చీఫ్ ఇంజనీర్లు జలసౌధలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని మే నెలాఖరు వరకు అవసరమయ్యే నీటికి సంబంధించి నివేదిక సిద్ధం చేశారు. తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరగా తమకు 55 టీఎంసీలు అవసరమని ఏపీ కోరింది. బోర్డు సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు గైర్హాజరయ్యారని ఏపీ సీఈ జలసౌధలోనే ఉండి కూడా సమావేశానికి రాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకున్నారని, ఇంకా తీసుకుంటున్నారని అన్నారు. తన వాదనను మినిట్స్ లో రికార్డు చేసి కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని రాహుల్ బొజ్జా కోరారు.
రేపు కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం : శ్రీశైలం నుంచి నీరు తీసుకోవద్దని బోర్డు చెబితే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిని ఆపిన ఆంధ్రప్రదేశ్ అధికారులు మల్యాల నుంచి తీసుకుంటున్నారని రాహుల్ బొజ్జా ఆక్షేపించారు. మల్యాల నుంచి కూడా ఏపీ నీరు తీసుకోకుండా ఆపాలని, నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి తీసుకునే నీటిని కూడా 5000 క్యూసెక్కులకు తగ్గించేలా చూడాలని బోర్డును రాహుల్ బొజ్జా కోరారు. రేపు ఉదయం 11 గంటలకు మరోమారు సమావేశం నిర్వహిద్దామని నీటి విడుదలకు సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకుంటానని బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ తెలిపారు. దీంతో రేపు ఉదయం కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మరోమారు జరగనుంది.
మీరు మీరు తేల్చుకోండి - నీటి పంపకాలపై కేఆర్ఎంబీ స్పష్టం
11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలి - కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ