TG High Court on Teachers Transfer and Promotion : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఇందులో వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదంది. పదోన్నతులు, బదిలీలు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉంటాయని, మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉన్నందున ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది.
బదిలీలో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, దీనివల్ల ఈ జిల్లాలో పనిచేసే తాము నష్టపోతున్నామంటూ రంగారెడ్డికి చెందిన సుమారు 40 మందికిపైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి మొదట బదిలీలు, పదోన్నతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం జులై 2న మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ పదోన్నతులు, బదిలీలు కొనసాగించవచ్చని, అయితే 40 పోస్టులను పిటిషనర్ల నిమిత్తం రిజర్వు చేయాలని ఆదేశించారు.
సీనియారిటీ జాబితా లేకుండా పదోన్నతులు, బదిలీలు : దీన్ని సవాలు చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఆభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఆలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు డి.బాలకిషన్రావు. పీవీ కృష్ణయ్యలు వాదనలు వినిపిస్తూ పదోన్నతులు, బదిలీలను తాము వ్యతిరేకించడంలేదని, సీనియారిటీ జాబితా లేకుండా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తమ కంటే జూనియర్లు ఇక్కడికి రావడంతో తమ పదోన్నతి అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు.
ప్రతివాదుల తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చినవారందరూ జూనియర్లేనని తెలిపారు. వీరి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విద్యార్థులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. కోర్టును ఆశ్రయించినవారికి 40 పోస్టులు ఖాళీగా ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని, ఉత్తర్వులు పిటిషనర్లకు అనుకూలంగా వచ్చినట్లయితే ఆ పోస్టులను వారికి కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీలు, పదోన్నతుల్లో ఎలాంటి నష్టం వాటిల్లదని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్ధిస్తూ ఆప్పీళ్లను కొట్టివేశారు.
ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం - తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచన - TG HC on Teachers Transfer