తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ.3.66 కోట్లను ఇష్టారాజ్యంగా అలా ఎలా ఖర్చు చేస్తారు?' - వాణిజ్య పన్నుల శాఖపై సర్కార్​ సీరియస్

వాణిజ్య పన్నుల శాఖలో వృథాగా ఖర్చు చేసిన రూ.3 కోట్ల 66 లక్షల నిధులపై ప్రభుత్వం ఆరా - రెండు కోట్లతో ల్యాప్‌ట్యాప్‌లు కొనుగోలు - కమిషనర్లకు కేటాయించిన నిధులతో కొత్త కారు కొనుగోలు

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

TG Govt On Unauthorised Expenditure
TG Govt On Unauthorised Expenditure in Taxes Department (ETV Bharat)

TG Govt On Unauthorised Expenditure in Taxes Department :తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వచ్చే ఆదాయానికి, చెయ్యాల్సిన ఖర్చులు అక్కడికక్కడే ఉండటంతో ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం చూసి ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పన్నుల శాఖ, ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల నిధులు ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఆఫీస్‌ అదర్‌ ఎక్స్‌పెండేచర్‌ పద్దు కింద వ్యయం చేసుకోడానికి వాణిజ్య పన్నుల శాఖకు రూ.9 కోట్ల 62 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రధానంగా కార్యాలయాల్లో జిరాక్స్‌ మిషన్లకు క్యాట్రిడ్జ్‌లు సమకూర్చుకోవడం, పెన్‌లు, పెన్సిళ్లు, పేపర్లు కొనుగోలు చేయడం, జాతీయ పర్వదినాల రోజున అవసరమైన మేర ఖర్చు చేసుకోడానికి తదితర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది.

ఇలా రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన నిధులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. అంటే మొత్తం మీద కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్‌ కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలితే తిరిగి ప్రభుత్వానికి సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ పని చేయలేదు. రూ.5 లక్షల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఆ శాఖ కమిషనర్‌కు ఉంది. అంతకు మించి వ్యయం చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అనుమతి తీసుకున్నా, నేరుగా కాకుండా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు ఖర్చు : అదేవిధంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే రహదారులు, భవనాల శాఖ నుంచి అంచనా వేయించడంతో పాటు, డిజైన్‌ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. పనులు కూడా అదే శాఖ చేయిస్తుంది. లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా చేయించుకోవాలి. కానీ ఇక్కడ ఆలాంటిదేమీ చేయలేదు. ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఆ కమిషనర్‌ ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. సాధారణంగా కొత్తగా కమిషనర్‌ వచ్చినప్పుడు తన ఛాంబర్‌ సక్రమంగా లేదని భావిస్తే ప్రభుత్వానికి నివేదించి బడ్జెట్‌ తెప్పించుకోవాలి. ఆ తరువాత ఛాంబర్‌లో మార్పులు, చేర్పులు ఏమేమి చేయాలి, డిజైన్‌ ఎలా ఉంటుందనే తదితరాలు రహదారులు భవనాల శాఖ అంచనా వేస్తుంది.

అదేవిధంగా చదరపు అడుగుకు ఎంత ఖర్చు అవుతుంది. ఏయే మెటీరియల్‌ వాడాలి తదితర వాటిని ఆర్​అండ్​బీ అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఆ తరువాత ఆ పనులను ఆర్​అండ్​బీ కానీ లేదా ఏ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అయినా నిర్మాణాలకు సంబంధించిన పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వానికి అత్యంత దగ్గరైన, జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిన, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో పాలుపంచుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కమిషనర్‌ ఛాంబర్‌ రెన్యువేషన్‌ చేసేందుకు రూ.కోటి మూడు లక్షల 18 వేల 671 రూపాయలు అవుతుందని అంచనా వేశారు.

కమిషనర్లకు ఇచ్చిన నిధులతో లగ్జరీ కారు కొనుగోలు : అందులో కొంత మాత్రమే చెల్లింపులు జరగగా, మిగిలిన బిల్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆరా తీస్తోంది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో ల్యాప్‌ట్యాప్‌లు అధికారులకు మాత్రమే ఇస్తారు. సీనియర్, జూనియర్‌ సహాయకులకు ఇచ్చే సంప్రదాయం లేదు. రాష్ట్రం ఓవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే, అవసరం లేకపోయినా రూ.2 కోట్లు ఖర్చు చేసి ఒక్కో ల్యాప్ టాప్ దాదాపు రూ.లక్ష వెచ్చించి 200 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ టెక్నాలజీస్‌ సర్వీస్‌ ద్వారా కొనుగోలు చేయలేదు.

వీటిని గత కమిషనర్‌ జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు ఇచ్చారు. కొత్తగా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ అవసరం లేని వాళ్లకు పంపిణీ చేయడాన్ని తప్పుబడుతూ వృథాగా పడి ఉన్న ల్యాప్‌టాప్‌లను వెనక్కి తెప్పించే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు కొత్తగా పదోన్నతులు పొందిన నలుగురు జాయింట్‌ కమిషనర్లకు అవసరమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన నిధులను ఉపయోగించి, రూ.80 లక్షల వరకు వెచ్చించి ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా చేశారు. ఇలా అనేక విషయాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ప్రభుత్వ కార్యదర్శి రిజ్వీ, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీస్తోంది.

ABOUT THE AUTHOR

...view details