తెలంగాణ

telangana

ETV Bharat / state

హైడ్రా నుంచి అద్దిరిపోయే న్యూస్! - కూల్చివేత బాధితులకు డబ్బులు - అలా చేస్తారట!

నగరంలో భారీగా అక్రమ నిర్మాణాలు - కూల్చివేతలు చేపడితే సామాన్యులు నష్టపోతారన్న ఆలోచనలో అధికారులు - బిల్డర్ల నుంచి కొనుగోలుదారులకు పరిహారం ఇప్పించేలా ప్రభుత్వంతో హైడ్రా చర్చలు

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

POLICY FOR HYDRA DEMOLITIONS
Telangana Government on Policy for Hydra Demolitions (ETV Bharat)

Telangana Government on Policy for Hydra Demolitions :నగరంలో ఓ బడా నిర్మాణ సంస్థ బాచుపల్లిలో చెరువును ఆనుకొని ఎఫ్‌టీఎల్‌లోనే రెండు టవర్లను నిర్మించింది. దాదాపు అక్కడ 1000 మంది ఒక్కో ఫ్లాట్‌ను రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఎఫ్‌టీఎల్‌లోనే ఈ ప్లాట్లు ఉన్నందున హైడ్రా చర్యలు చేపడితే, అందులో ఉంటున్న వారంతా రోడ్డున పడే అవకాశం ఉంది. మూసాపేటలోనూ ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ను మార్చేసి అపార్ట్​మెంట్ల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. ఇవే కాకుండా నగరంలో అక్రమ నిర్మాణాలు భారీగానే ఉన్నాయి. ఇందులో కొన్ని తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారు.

నిబంధనల ప్రకారం అయితే వీటిని హైడ్రా కూల్చివేయాల్సిందే. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నో ఏళ్ల కింద కొనుగోలు చేసిన సామాన్యులు రోడ్డునపడతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాల కూల్చివేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో హైడ్రా అధికారులున్నారు. బాధితులకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల కిందట హైడ్రా కమిషనర్​ రంగనాథ్‌ కూడా ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. దీంతో సీఎం రేవంత్​రెడ్డితో చర్చించాలని భట్టి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రెండు నెలలు హైడ్రాకు బ్రేక్‌ :దాదాపు 2 వేలకు పైగా కట్టడాలు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్నాయి. వీటిలో చాలా వాటికి బల్దియా, హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చాయి. కొందరు బిల్డర్లు అయితే ఒక సర్వే నంబరులో అనుమతులు తీసుకుని, మరో సర్వే నంబర్​లో ఇళ్లను నిర్మించారు. వీటిని వేలాది మంది కొనుగోలు చేశారు. ఇప్పుడు వీటిని కూల్చితే కొనుగోలు చేసిన వారంతా తీవ్రంగా నష్టపోతారని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మంత్రులతో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి నిర్ణయించారని అధికారవర్గాలు చెబుతున్నాయి. బిల్డర్‌ నుంచి కొనుగోలుదారులకు పరిహారం ఇప్పించేలా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూసీ విషయంలోనూ దీన్నే అవలంభిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదని హైడ్రా నిర్ణయించింది.

హైదరాబాద్‌ చెరువులకు మహర్దశ! - మంచినీటి జల వనరులుగా తీర్చిదిద్దనున్న హైడ్రా

ABOUT THE AUTHOR

...view details