CM Revanth Key Decisions on Tourism Development : రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యటక, ఆధ్యాత్మిక బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
బుద్ధ మ్యూజియం ఏర్పాటు : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ను పంపించింది. బుద్ధవనంలో 25 కోట్ల రూపాయలతో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం, ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటును కూడా ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్వాటర్ వరకు బోట్లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు.
టూరిజం సర్క్యూట్ : హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్సాగర్ పరిసరాలను ప్రపంచస్థాయి పర్యాటక హబ్గా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.