తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో భూగర్భ బావులు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు - UNDERGROUND WELLS IN HYD

హైదరాబాద్‌లో రోడ్లపై వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి - వరదనీటిని కట్టడి చేసేందుకు భూగర్భ సంపుల నిర్మాణానికి శ్రీకారం - ప్రయోగాత్మకంగా 14 చోట్ల భూగర్భ సంపుల నిర్మాణం

UNDERGROUND TUNNEL IN HYD
Telangana Government on Flood prone Areas (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 8:15 PM IST

Telangana Government on Flood prone Areas :హైదరాబాద్‌లో ప్రధాన రహదారులపై నిలిచే వరదనీటి నుంచి నగరవాసులు, వాహనదారుల కష్టాలను గట్టెక్కించేందుకు చేపట్టిన భూగర్భ సంపుల నిర్మాణాన్ని జీహెచ్​ఎంసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. 6 జోన్లలో ఒక్కో జోన్‌కు 5 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రాథమికంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 14 ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 20 కోట్లు కేటాయించగా 10 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని వరద నీటిని సంపుల్లోకి మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసేందుకు పనులు చేస్తున్నారు.

ఖైరతాబాద్ జోన్‌పరిధిలో సచివాలయం ఎదురుగా 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపును నిర్మించారు. 150 అడుగుల లోతులో 4 ఇంజక్షన్ బోర్‌వెల్స్ వేసి వరదనీటిని మళ్లించనున్నారు. దాదాపు ఆ పనులు పూర్తికాగా సంపు చుట్టూ గ్రిల్స్ బిగిస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ మట్టిని తొలగించి తారురోడ్డు వేశారు. ప్రయాణ ప్రాంగణానికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌భవన్‌రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద 13 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు, ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో సంపు నిర్మించారు.

ఖైరతాబాద్​లోనే 12 భూగర్భ సంపుల నిర్మాణం :అక్కడ కేబుల్స్ అడ్డురావడంతో ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు కుంగిపోకుండా పకడ్బందీగా నిర్మాణం చేపట్టారు. ఉపరితలంలో నలువైపుల నుంచి వచ్చే వరద నీరంతా అందులోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. వరదనీరు ఎక్కువైతే అక్కడి నుంచి మోటార్ల ద్వారా సమీపంలోని వరద కాలువలోకి మళ్లించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ నాలుగు చోట్ల పనులు పూర్తి కావడంతో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ వాటిని పరిశీలించారు.

భూగర్భ సంపుల సామర్థ్యం ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షపాతం, వరద నీటి సమస్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను దాన కిషోర్‌ ఆదేశించారు. ఒక్క ఖైరతాబాద్ జోన్‌లోనే 12 భూగర్భ సంపుల నిర్మాణం మొదలు పెట్టగా మూడు నెలలు శ్రమించి నాలుగు పూర్తి చేశారు. శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్లల్లో మరో రెండింటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో వరద నీటి నివారణ కోసం సుమారు రూ.100 కోట్లతో ప్రభుత్వం ఆ భూగర్భ సంపులను నిర్మిస్తోంది.

ఇళ్లు, భవనాల్లో ఇంకుడు గుంత తప్పనిసరి - ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్ మీరూ తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details