తెలంగాణ

telangana

ఆ నిధులు రుణమాఫీకే వాడాలి - ఇతర అప్పులకు జమ చేయొద్దు: డిప్యూటీ సీఎం భట్టి - Telangana Loan Waiver Today

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 2:16 PM IST

Deputy CM Bhatti Meeting With Bankers 2024 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని హెచ్చరించారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.

Deputy CM Bhatti
Deputy CM Bhatti (ETV Bharat)

Deputy CM Bhatti On Loan Waiver in Telangana: ఆగస్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని 40లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా 31వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన ఆయన రైతు రుణమాఫీపై చర్చించారు. రుణమాఫీ సకాలంలో ఇబ్బందులు ఎదురు కాకుండా బ్యాంకులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

'ఇతర అప్పులకు జమ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. గురువారం సాయంత్రం 4గంటలకు 11లక్షల పైబడి రైతులకు రూ.6000 కోట్ల పైబడి నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఆ తర్వాత 2లక్షల వరకు రుణమాఫీ నిధులిస్తాం. రెండు లక్షలపైన రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి.' అని భట్టి సూచించారు.

Telangana Rythu Runa Mafi :ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమన్న ఆయన ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా 31వేల కోట్లు ఏ రాష్ట్రంలో మాఫీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్లామని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తు.చ. తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు.

ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి - రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి : సీఎం రేవంత్ - congress Meeting at Praja Bhavan

"భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర. కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టర్‌లో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా పెద్ద ప్రోత్సాహం. ఈరోజు రైతులు ఎలా పండుగ చేసుకుంటున్నారో బ్యాంకర్లు కూడా అలాగే సంబురాలు చేసుకోవాలి. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. రాష్ట్ర జీడీపీలో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి. రుణాలు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు. ఈ విషయంలో లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలి." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

బ్యాంకర్లతో సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడారు. రూ.30వేల కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే గర్వించదగిన రోజు అని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. బ్యాంకుల వద్ద తొక్కిసలాట జరగకుండా బ్యాంకర్లు చూడాలని తుమ్మల సూచించారు. గ్రామాల వారిగా తేదీలు ప్రకటించి రుణమాఫీ సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు.

తేదీ జులై 18, 2024 - సమయం సాయంత్రం 4 గంటలు - తెలంగాణ రైతుల రుణం మాఫీ అయ్యే ముహూర్తం ఇదే - TELANGANA RYTHU RUNA MAFI TODAY

ABOUT THE AUTHOR

...view details