Telangana Congress Focus on New Joinings :అధికార కాంగ్రెస్లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వివిధ స్థాయిల నేతలు హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. పార్టీలోకి వచ్చేవారు ముందుగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాల్సి ఉంది. పెద్ద నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినప్పుడు ఏఐసీసీ అనుమతి తీసుకొని కార్యక్రమం చేపడుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
PCC on Leaders Joinings :కానీ కొందరు నేతలు ఎన్నికల వేళ పార్టీని వీడి బీఆర్ఎస్, బీజేపీలో చేరారు. వారిలో కొందరు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు చొరవ చూపుతున్నారు. కొందరు నాయకులు పీసీసీకి సమాచారం లేకుండానే రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ చేతుల మీదుగా కండువా కప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (CM Revanth REeddy) ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో చిన్నపాటి నాయకుల చేరికపై పీసీసీలో చర్చకు రావట్లేదని తెలుస్తోంది.
గులాబీ ఖాతా ఖాళీ చేసేందుకు 'ఆపరేషన్ చేవెళ్ల' - కాంగ్రెస్ వ్యూహం మామూలుగా లేదుగా?
నేరుగా రాష్ట్ర ఇంఛార్జ్ వద్ద కండువా కప్పుకొని హస్తం పార్టీలోకి రావటంతో స్థానిక డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి వెళ్లి ఓటమిపాలై తిరిగి కాంగ్రెస్లో చేరుతుండడం స్థానిక నాయకత్వానికి ఇబ్బందిగా పరిగణిస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు చేరేముందు స్థానిక నాయకత్వం ద్వారా పార్టీలో చేరేలా చేయాలని డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్లు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే గాంధీభవన్లో దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్రెడ్డి(Patnam Sunita Mahender Reddy),మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి, పటాన్చెరు నాయకుడు నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారంతా పీసీసీతో చర్చించి ఏఐసీసీ ఆమోదంతో చేరినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలవేళ మునుగోడు నియోజకవర్గ నేత చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ తరఫున పోటీచేశారు. ఓటమి పాలుకావడంతో హస్తం పార్టీలోకి వచ్చేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.