తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజన జీవిన విధానానికి సజీవ సాక్ష్యం ఈ ట్రైబల్‌ మ్యూజియం - ఎక్కడుందో తెలుసా? - NEHRU CENTENARY TRIBAL MUSEUM

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్‌ మ్యూజియం ప్రత్యేకత - గిరిజన అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్న మ్యూజియం - 10 గిరిజన తెగల జీవన విధానాన్ని తెలిపేలా ఏర్పాట్లు

Nehru Centenary Tribal Museum
Nehru Centenary Tribal Museum (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 3:27 PM IST

Updated : Feb 18, 2025, 6:33 PM IST

Nehru Centenary Tribal Museum :సంస్కృతి, సంప్రదాయం, వస్త్రధారణలో గిరిజనులది ప్రత్యేక శైలి. ఆ శైలి అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మరిన్ని సొబగులు అద్దే విధంగా ఉంటుంది. క్రమంగా కొన్ని కనుమరుగవుతున్నా, వాటి అస్థిత్వాన్ని వారి ఆచారాలు చాటుకుంటూనే ఉన్నాయి. పట్నం వాసులకు, విద్యార్థులకు ఈ అటవీ జీవన విధానాన్ని పరిచయం చేసేందుకు గిరిజన తెగల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు మనకు చూపిస్తోంది నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం. ఆ మ్యూజియం విశేషాలేంటో మీరూ చూసేయండి.

ఆదిమ గిరిజన తెగ మనిషి నుంచి ఆధునిక మానవుని వరకు పరిణామ క్రమం ఎప్పుడూ అద్భుతమే. ఆ క్రమంలో ఉపయోగించిన వస్తువులు, ధరించిన వస్త్రాలు ప్రతీదీ ఇప్పుడు ప్రత్యేకమే. దాన్ని నేటితరానికి అందించేందుకు మ్యూజియాలు వారధులుగా పని చేస్తున్నాయి. అలా గిరిజన సంస్కృతిని తెలుపుతోందీ మ్యూజియం. మ్యూజియంలోకి వెళ్లగానే ఎదురుగా గోండుల సవారి బండి ఉంటుంది. అయితే ఇందులో వ్యవసాయానికి వాడే ఎడ్లు కాకుండా కంకలు అనే చిన్న ఎడ్లను వాడతారు.

బండిని రంగురంగుల వస్త్రాలతో అద్భుతంగా అలకరించి, సరదాగా సవారీ చేసేందుకు గోండులు వాడేవారు. మ్యూజియం ప్రధాన ద్వారానికి ఎడమ వైపుగా నాయక్‌ పోడులు కొలిచే దేవతామూర్తుల ముఖాలు దర్శనమిస్తాయి. నాయక్ పోడులు భీముడు-హిడింబి వారసులుగా చెప్పుకుంటారు. అందుకే వారు శ్రీకృష్ణుడితో పాటు లక్ష్మీదేవరను కొలుస్తారు. వారితో పాటు పంచ పాండవులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు.

"హైదరాబాద్‌లో నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం ఉంది. ఇది చాలా పాత మ్యూజియం. దీంట్లో మన రాష్ట్రంలోని అన్ని గిరిజన జాతుల గురించి తెలుసుకుంటారు. వాళ్ల నివాసాలు ఎలా ఉండేవి, వాటిని ఎలా నిర్మించుకునేవారు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు ఇలా ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకోవచ్చు." - సముజ్వల, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ

10 గిరిజన తెగలకు సంబంధించి పూర్తి వివరాలు : ఈ భవనం 2003లో ప్రారంభమైంది. అయితే 11 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 32 గిరిజన తెగల అన్ని వివరాలు ఇందులో ఉండేవి. 70 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెగల వివరాలే ఉంటే, 30 శాతం తెలంగాణ తెగలకు సంబంధించిన వివరాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, నిధులు మంజూరు చేయించుకుని, ఈ మ్యూజియంలో పూర్తిగా తెలంగాణలోని 10 గిరిజన తెగలకు సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో కోలం, తోటి, కొండారెడ్డి, చెంచులు ఈ నాలుగు ముఖ్యంగా వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్‌గా ఉన్నాయి. మిగతావి గోండు, కోయ, అంధ్, బంజారా, ఎరుకలతో పాటు మరో తెగ జీవన విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

కొండరెడ్లు ఇప్పటికీ ఇదే పద్ధతి : గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ఈ తెగలు వ్యవసాయంతో పాటు పశుపోషణను తమ ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. వేటాడటంలో చెంచులు సిద్ధహస్తులైతే, తేనె సేకరణలో కొండరెడ్లు ప్రముఖంగా ఉన్నారు. కొండ ప్రాంతాల్లో తేనె సేకరించేందుకు భార్య, భర్త, భార్య తమ్ముడు (బావమరిది) ఒక బృందంగా ఏర్పడి వెళ్తారు. చెట్టును ఆధారంగా చేసుకుని, తాడు ఒక భాగాన్ని భర్త నడుముకు కట్టుకుని కిందకు దిగుతాడు. పైన భార్యతో పాటు భార్య తమ్ముడు తాడు మరో భాగాన్ని పట్టుకుని ఉంటారు. కొండరెడ్లు ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

"ఈ మ్యూజియంలో గిరిజనుల ప్రాంతాల గురించి చాలా మంచిగా చెప్పారు. వాళ్లు అప్పట్లో ఎలా ఉండేవారో, వస్తువులు తయారు చేసే విధానం, ఇలా ప్రతిదాన్ని చాలా స్పష్టంగా చూపించారు. మేం చాలా విషయాలు తెలుసుకున్నాము." - విద్యార్థిని

కొండరెడ్లు, చెంచులు నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెంలో నివసిస్తున్నారు. మిగతా జాతుల వారు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించారు. అంధ్ తెగవారిని మెడిసిన్ మ్యాన్స్‌గా పిలుస్తుంటారు. అందుకు వారు అందించే ఆయుర్వేద మందులే ఇందుకు కారణం. గోండులు పంచాయతీ నిర్వహించే పద్ధతి, వెదురు బొంగులు, తడకలకు మట్టిని అద్ది వారు గోడలతో ఇళ్లు నిర్మించుకున్న పద్ధతి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. అలాగే ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి సంబంధించి కూడా మ్యూజియంలో వివరాల్ని పొందుపరిచారు.

థియేటర్‌లో ప్రదర్శన :పూర్తి సమాచారం విజువలైజ్ చేసి డిజిటల్ స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఆయా తెగల మాతృభాష, వారి సామాజిక జీవన నిర్మాణం, వారు జరుపుకునే పండుగలు, వారి జనాభా, అక్షరాస్యత అన్నింటినీ డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇవన్నీ చూసేసిన తర్వాత ఏయే తెగలు ఏమేం చేస్తున్నాయి? వారికి సంబంధించిన అన్ని వివరాలు 100 మంది సామర్థ్యం గల థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు.

గోండుల జీవన విధానానికి సజీవ సాక్ష్యం : డాక్యుమెంటేషన్‌ మాత్రమే కాకుండా ఆదిలాబాద్‌లోని గోండుల జీవన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఆస్ట్రియా నుంచి వచ్చిన హైమన్ డాఫ్, అతని శిష్యుడు మార్క్ యార్కే అప్పట్లో తీసిన చిత్రాలే ప్రస్తుతం గోండుల జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గిరిజన హస్తకళలు, వారు వాడిన రోజువారీ వస్తువులు, వేటకు ఉపయోగించిన కత్తులు, కొడవళ్లు మనల్ని ఆనాటి కాలానికి తీసుకెళతాయి.

పాఠశాల విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో ఉండే చాలా అంశాలను అనుభవపూర్వకంగా చెప్పేందుకు ఈ మ్యూజియం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే నగరంలో ఉన్న అన్ని పాఠశాలలకు మ్యూజియాన్ని సందర్శించాలని నిర్వాహకులు ఇప్పటికే లేఖలు రాశారు. ఇందుకోసం చిన్నపిల్లలకు, విద్యార్థులకు రూ.2, పెద్దలకు రూ.10గా టికెట్ ధర నిర్ణయించారు.

పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్! - ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods

YUVA : గిరిజన బిడ్డకు బాంబే ఐఐటీలో సీటు - కోచింగ్‌ తీసుకోకుండానే జేఈఈ ఫలితాల్లో ర్యాంకు - Khammam JEE Ranker Navya Story

Last Updated : Feb 18, 2025, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details