A Man Secured 8 Govt jobs :నేటి యువత ఒక ప్రభుత్వ కొలువును సాధించడానికి ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటూ నానా తంటాలు పడుతున్నా ఉద్యోగం రాని పరిస్థితులు ఎక్కువుగా చూస్తున్నాం. పుస్తకాలతో కుస్తీపడుతూ గదుల్లో మగ్గిపోతూ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువత పోరాడుతున్నారు. కానీ మెదక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏటువంటి కోచింగ్ లేకుండా తమ కుటుంబ కష్టాలను గుర్తి చేసుకుంటూ ఏకంగా 8 ప్రభుత్వ కొలువులు సాధించాడు. మరి అన్ని ఉద్యోగాలు ఎలా సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటి :మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఫరీద్పూర్ తండాకు చెందిన చత్రియ, కమిలి దంపతుల కుమారుడు శ్రీనివాస్. వీరిది పేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత మెదక్లో ఇంటర్, డిగ్రీ, సికింద్రాబాద్లో పీజీ పూర్తి చేశాడు. 2007 నుంచి ఇంట్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. భార్య సరిత అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ భర్తకు చదువులో తోడునీడగా నిలిచింది. 2012లో ఆర్టీసీలో జూనియర్ అకౌంటింగ్ ఉద్యోగం సాధించి రెండేళ్ల పాటు చేశారు.
అంతటితో ఆగని శ్రీనివాస్ మళ్లీ తమ కసరత్తును మెుదలు పెట్టి డీసీబీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించాడు. తర్వాత 2014లో పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించాడు. 2015లో హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా విభాగంలో జూనియర్ అకౌంటెంట్, 2016 లో ఫుడ్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అకౌంటెంట్, అదే సంవతర్సంలో బీఎస్ఎన్ఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా 2023లో గురుకుల అధ్యాపకుడిగా కొలువులు సాధించాడు.