SLBC Tunnel Collapse Rescue Operation: తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. SLBC సొరంగమార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు Army, NDRF, STDRF, సింగరేణి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రికి ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలను వేగం చేశాయి.
మరో అర కిలోమీటరు వెళ్లేందుకుఛ సహాయ చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద కూలిన పైకప్పు కూలింది. అయితే 13.5 కి.మీ. వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉందని రెస్క్యూ సిబ్బంది అంటోంది.
ఆ 200 మీటర్ల గ్యాప్లో 8 మంది:పనులు జరుగుతున్న సమయంలో నీటి ఉద్ధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక్కి రావడంతో 200 మీటర్లు గ్యాప్ ఏర్పడింది. 200 మీటర్ల గ్యాప్లో 8 మంది చిక్కుకున్నారని సహాయ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం రెస్క్యూ బృందాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం కనిపించింది. కాగా ఒక్కసారిగా సొరంగం పైకప్పు కూలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) మట్టితో కూరుకుపోయింది.
8 మంది ఉద్యోగులు, కార్మికులు టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయ చర్యలను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి తెలంగాణ మంత్రి ఉత్తమ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సహాయ చర్యలపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
రేవంత్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన మోదీ, రాహుల్ :SLBC (SRISAILAM LEFT BANK CANAL) ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ సుమారు 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు రాహుల్కు రేవంత్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలన్నారు.
ఇదీ జరిగింది: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలోకి శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 40 మంది లోపలికి వెళ్లారు. 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఒత్తిడితో నీటి ప్రవాహాం, మట్టి సొరంగంలోకి వచ్చి చేరింది. ఆ వెంటనే సొరంగ మార్గం చుట్టూ ఉన్న సెగ్మెంట్లు కూలాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉన్న 8 మంది ఉద్యోగులు అక్కడే చిక్కుకుకున్నారు. టీబీఎం వెనకభాగంలో ఉన్నవారు బయటకు వచ్చేశారు.
శ్రీశైలం SLBC టన్నెల్ ప్రమాదం - చిక్కుకున్న 8 మంది - రంగంలోకి భారత సైన్యం