Ramana Deekshitulu Files Petition :తనపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తిరుమల ఒకటో పట్టణం పోలీసులు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ టీటీడీ గౌరవ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Police Notices to Ramana Deekshitulu :సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీశాఖ జీఎం సందీప్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణ దీక్షితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసి విచారణ నిమిత్తం హాజరు కావాలని కోరారు. ఈ నోటీసులు సవాలు చేస్తూ డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు
ఓవైపు కేసులో నిందితునిగా పేర్కొంటూ మరోవైపు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షులను విచారణకు పిలవడం నోటీసు ఇవ్వడం చెల్లదని పిటీషనర్ న్యాయవాది వాదించారు. చట్ట నిబంధనల ప్రకారం 65 ఏళ్ల పైబడిన వారిని విచారణకు పిలిచే అధికారం పోలీసులకు లేదని అన్నారు. పిటిషనర్ వయసు 76 ఏళ్లని గుర్తు చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషన్ మొదటి సారి విచారణకు వచ్చిన నేపథ్యంలో పూర్తి వివరాలు సమర్పించడానికి పోలీసులకు కొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వారం రోజులకు వాయిదా వేశారు.