Producer SKN Auto Gifted to Pawan Kalyan Fan Family:బేబి చిత్ర నిర్మాత, పవన్ కల్యాణ్ వీరాభిమాని ఎస్కేఎన్ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద మహిళకు ఆటోను బహుమతిగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని మరియమ్మ హామీ ఇచ్చింది. ఆ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన ఎస్కేఎన్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం వెళ్లిన ఎస్కేన్ మరియమ్మకు ఆటో కానుకగా ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపారు. ఆటోకు రిబ్బన్ కట్ చేసి మరియమ్మతో కలిసి ఆటోలో తిరిగి ఆనందపర్చారు. ఎక్స్ వేదికగా మరియమ్మ కుటుంబంతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఎస్కేఎన్ తన మాట నిలుపుకోవడమే కాకుండా మరియమ్మ కుటుంబానికి ఆధారంగా నిలవడం పట్ల జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ జరిగింది:రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం జోరుగా సాగుతుండగా పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులు పెట్టి, ఊరంతా పార్టీ ఇచ్చేస్తా అని మరియమ్మ అనే మహిళ అన్న వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ వీడియోను జనసేన పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా దానికి నిర్మాత ఎస్కేయన్ స్పందించారు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత ఆటో కొని వీడియోలో ఉన్న మహిళ భర్తకు కానుకగా ఇస్తానని తెలిపారు. నా హీరో, అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి అని అన్నారు.