తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగ ప్రయాణం వామ్మో మరీ ఇంత ఖరీదా? - రద్దీని 'క్యాష్' చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్

ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు దండుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ - తనిఖీలు విస్మరించిన రవాణా శాఖ

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Private Travels Hike Bus Charges
Private Travels Hike Bus Charges (ETV Bharat)

Private Travels Hike Bus Charges : దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ఎడాపెడా దోచేస్తున్నాయి. సాధారణ ఛార్జీల స్థానంలో ఒక్కసారిగా రేట్లు పెంచేశాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని, కొన్ని సీట్లే మిగిలాయంటూ ప్రయాణికుల నుంచి వాటికి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లిమిటెడ్​గా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు.

సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ :శనివారం దసరా పండుగ, ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లోనే సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఇదే అదనుగా భావించి ఈ రెండు రోజుల్లోనే ట్రావెల్స్‌ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 1,200 వరకు ట్రావెల్స్‌ బస్సులు ఉండగా, పేరున్న ప్రముఖ ప్రైవేటు సంస్థలే ఛార్జీల బాదుడులో పోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల కంటే ఈ రెండు రోజుల్లో ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ.వెయ్యి, నాన్‌ ఏసీ బస్సుల్లో రూ.700 వరకు అదనంగా దండుకుంటున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి పలు ప్రైవేటు ట్రావెల్స్‌ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌కు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

విజయవాడ నుంచి కాకినాడకు 1,500 రూపాయల నుంచి రూ.2 వేలు తీసుకుంటున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ ఏసీ ఇంద్ర సర్వీసులో సీటుకు రూ.905, అమరావతిలో రూ.1,120 కాగా, నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీలో 704 రూపాయలు మాత్రమే. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోల్చినప్పుడు ఈ రేట్లు తక్కువే అయినప్పటికీ, అనేక బస్సుల్లో ఒకట్రెండు సీట్లే ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్లేవారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల్లోని ముఖ్య పట్టణాలకు వెళ్లే సర్వీసుల్లో ఛార్జీల మోత అధికంగా ఉంది.

తిరుగు ప్రయాణంలో రెండింతల వడ్డన :దసరా పండుగ సెలవులు ఆదివారంతో ముగుస్తుండగా, అనేక విద్యాసంస్థలు సోమవారమే తిరిగి తెరుచుకోనున్నాయి. తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేలా ఆదివారం సాయంత్రం నుంచి బయల్దేరే సర్వీసులకు అత్యంత డిమాండ్‌ సృష్టించారు. సాధారణ ఛార్జీల కన్నా రెండు రెట్లు అదనంగా రాబడుతున్నారు. విశాఖపట్నం- విజయవాడ మధ్య పలు సర్వీసుల్లో ఏకంగా 3 వేల రూపాయలకు పైగా ఛార్జీ వసూలు చేస్తున్నాయి. ట్రావెల్స్‌ సంస్థలు అమాంతం పెంచేసిన టికెట్‌ ఛార్జీలను ఆన్‌లైన్‌లో దర్జాగా ప్రదర్శిస్తున్నప్పటికీ, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి మన రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు అధిక ఛార్జీలతో రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు చేయడం లేదు.

సరిపోని రైళ్లు, బస్సులు.. ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్

పండుగ ప్రయాణం.. అమ్మో మరీ ఇంతా ఖరీదా..!

ABOUT THE AUTHOR

...view details