తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ కడుపులోంచి వచ్చారు - అంగట్లో సరుకయ్యారు - CHILDREN SELLING GANG ARREST IN HYD

చైతన్యపురిలో చిన్నపిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్టు - గుజరాత్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న నిందితులు - మల్కాజ్​గిరి ఎస్‌వోటీ సాయంతో ముఠాను పట్టుకున్న చైతన్యపురి పోలీసులు

Gang Selling Children Arrested in Hyderabad
Gang Selling Children Arrested in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 4:39 PM IST

Updated : Feb 25, 2025, 9:37 PM IST

Gang Selling Children Arrested in Hyderabad :పిల్లలు లేరని భర్త వదిలేసిన ఓ వివాహిత, అక్రమంగా పిల్లల్ని విక్రయించే గుజరాత్‌ ముఠాతో చేతులు కలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముక్కుపచ్చలారని పిల్లలను చట్టవ్యతిరేకంగా మధ్యవర్తులతో కలిసి అమ్మేసింది. కొనుగోలు చేసిన వారు సైతం ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, అనే వివరాలు ఆరా తీయలేదు. గుజరాత్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రైలు మార్గంలో పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

పరారీలో కీలక నిందితులు : నలుగురు నవజాత శిశువుల్ని రక్షించి 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు దళారులు, ఐదుగురు కొనుగోలుదారులు ఉన్నారు. రక్షించిన నలుగురు చిన్నారులను ఏపీలో ముగ్గుర్ని, తెలంగాణలో ఒకర్ని విక్రయించారు. చిన్నారుల అక్రమ రవాణా కీలక సూత్రధారి, ఆమె సహాయకులు పరారీలో ఉన్నారు.

ఆన్​లైన్​లో చూసి : హైదరాబాద్​ సూరారంలో ఉండే కోలా క్రిష్ణవేణికి వివాహమైనా పిల్లలు పుట్టకపోవడంతో భర్త విడాకులిచ్చాడు. ఎమ్మెల్సీ బయోకెమిస్ట్రీ చదివిన ఆమె మెడికల్ రిప్రజెంటేటర్‌గా పనిచేస్తుంది. ఈమెతో పరిచయమున్న పిల్లలు లేని దంపతులు, తమకు చిన్నారులను కొనుగోలు చేయడంలో సహకరించాలని అడిగారు. దాంతో కృష్ణవేణి ఫేస్‌బుక్‌లో వెతికి దిల్లీకి చెందిన మనోజ్‌ను సంప్రదించగా 5 లక్షల రూపాయలకు చిన్నారులను అమ్ముతామని చెప్పాడు. చెప్పినట్టే గతేడాది మనోజ్ దిల్లీ నుంచి చిన్నారిని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో అప్పట్లో క్రిష్ణవేణిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఈసారి ఫేస్​బుక్​ ద్వారా : జైలు నుంచి విడుదలైన క్రిష్ణవేణి గురించి తెలుసుకున్న చెందిన బట్టు శ్రవణ్‌కుమార్, దీప్తి దంపతులు, గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేసే కవాడిగూడకు చెందిన బూడిది సంపత్‌కుమార్ ఫలక్‌నుమాకు చెందిన ఆశావర్కర్ ఆంగోత్‌ శారద తదితరులు తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని ఇందుకోసం డబ్బులు ఇస్తారని చెప్పారు. దీంతో క్రిష్ణవేణి ఈసారి ఫేస్‌బుక్‌లో గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన వందనను సంప్రదించగా ఆడపిల్లకు 2 నుంచి 3 లక్షలు, మగపిల్లాడికి 4 నుంచి 5 లక్షల వరకు ధర ఉంటుందని చెప్పింది. ఒప్పందం ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లల్ని తన అనుచరులు అహ్మదాబాద్‌కు చెందిన గౌతమ్‌సావిత్రీ దేవీ, సునితా సుమన్ ద్వారా రైలులో పంపించింది. వీరు వచ్చే సమయానికి కృష్ణవేణి, ఇతర ముఠా సభ్యులు చిన్నారులు అవసరమున్న తల్లిదండ్రుల్ని హైదరాబాద్‌కు రప్పించి పిల్లలు రాగానే విక్రయించేవారు.

అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ : గుజరాత్‌ నుంచి తీసుకొచ్చిన చిన్నారులు ఒక్కొక్కరిని విక్రయించినందుకు కృష్ణవేణి, మిగతా ముఠా సభ్యులు కమిషన్ కింద దంపతుల నుంచి 50 వేల వరకూ వసూలు చేసేవారు. నిందితులు కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుతూ సంప్రదింపులు జరిపేవారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆడపిల్ల, మగపిల్లల్ని కోడ్‌లతో పిలిచేవారు. పిల్లల్ని అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసిన జైలుకెళ్లడం ఖాయమని భావించిన నిందితులు, చట్టబద్దంగా జరిగినట్లు నమ్మించడానికి, కొనుగోలు చేసినవారికే జన్మించినట్లు నకిలీ జనన ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డులు సృష్టించేవారు. ఇలా నెల రోజుల్లో ముగ్గురు చిన్నారుల్ని విక్రయించారు.

ఎస్వోటీకి వచ్చిన సమాచారంతో : ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకు చైతన్యపురి బస్‌స్టాప్ వద్ద కోలా కృష్ణవేణి, సావిత్రీదేవీ, సంపత్‌ ముగ్గురూ కలిసి ఓ చిన్నారిని తీసుకని వెళ్తుండగా ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా ప్రశ్నించగా గుజరాత్‌ నుంచి తీసుకొచ్చిన చిన్నారుల్ని విక్రయించినట్లు ఒప్పుకున్నారు. ఈ ముగ్గురితో పాటు దీప్తి, శారద, శ్రవణ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌ నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారా, లేక ఆస్పత్రుల వద్ద తల్లిదండ్రులకు డబ్బు ఆశజూపి కొనుగోలు చేస్తున్నారా తదితర విషయాలపై ఆరా తీస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ప్రధాన సూత్రధారి గుజరాత్‌కు చెందిన వందన చిక్కితే ముఠా కార్యకలాపాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.

"వీళ్లంత సోషల్​ మీడియా ద్వారా ఒక్కటై ఇలాంటి ఆక్రమాలు మొదలుపెట్టారు. అక్కడ పుట్టిన పిల్లలను అమ్మడానికి గుజరాత్​ నుంచి తీసుకువచ్చి, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఒక్క చిన్నారిని విక్రయించేందుకు సుమారు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని నడిపిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లిదండ్రులకు తీసుకునే వారికి అసలు పరిచయం ఉండదు. ఇలా అక్రమంగా డబ్బులిచ్చి పిల్లలు కొంటున్నవారిని కూడా మేము నేరస్థులుగా పరిగణిస్తున్నాం. వారందరిపై చర్యలు తీసుకుంటాం" - సుధీర్​ బాబు, రాచకొండ సీపీ

విద్యావంతులు సైతం :రక్షించిన నలుగురు చిన్నారులను పోలీసులు రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యుూసీ అధికారులకు అప్పగించారు. వీరిని కొనుగోలు చేసిన వారిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా పలువురు విద్యావంతులు ఉండడం గమనార్హం. సంతానం లేని వారు పిల్లలు కావాలనుకుంటే చట్టప్రకారం దత్తత తీసుకోవాలని కానీ, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

నీకు బైక్​ కావాలా స్కూటీయా? - ఇవి వాహనాలు కాదు చిన్నారుల విక్రయానికి కోడ్​వర్డ్స్​ - Child Trafficking Case in Hyderabad

కోడ్​ భాషలో సంభాషణ - సొంత తల్లిలా నటించే మహిళలు - చిన్నారుల అక్రమ రవాణాలో విస్తుపోయే విషయాలు - CHILD TRAFFICKING GANG IN HYDERABAD

Last Updated : Feb 25, 2025, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details