తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్పపీడన ద్రోణితో అల్లకల్లోలంగా మారిన కోస్తా జిల్లాలు - ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్

తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు - కంట్రోల్‌ రూమ్‌లు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

heavy rains in andhra pradesh
heavy rains in ap (ETV Bharat)

IMD Warns of Heavy Rains in Andhra Pradesh : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టింది. కొండచరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం వద్ద భక్తులు స్నానమాచరిస్తూ సందడి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు పెన్నా నదికి వరద పోటెత్తడంతో, పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం :రహదారులన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విడవలూరు మండలంలోని సముద్ర తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగింది. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో కంది చేలల్లోకి నీరు భారీగా చేరింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేస్తుండటంతో నీరు ఎక్కువ రోజులు ఉంటే పంట దెబ్బతింటుందని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చీరాలలో వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలోని మురుగు నీరు, వర్షపు నీటితో ప్రవహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని కొన్ని మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. జాతీయ రహదారి 216పై కాకినాడ-అమలాపురం మధ్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వానలు పడుతున్నందు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారానికి(రేపటికి) తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. ఈ తుపాను ఈనెల 17న చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు.

తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు? - వాటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా?

హైదరాబాద్​లో ఓ వైపు ఎండ మరోవైపు వాన - వాహనదారులకు తప్పని తిప్పలు

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details