Operation Marcos in SLBC Tunnel :శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(ఎస్ఎల్బీసీ)లో చిక్కుకున్న కార్మికులను కోసం నాలుగు రోజుల నుంచి వెతుకుతున్న వారి జాడ దొరకట్లేదు. దీంతో సొరంగంలో ఇవాళ ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. ఈ సభ్యులనే మార్కోస్గా పిలుస్తారు.
రంగంలోకి ప్రఖ్యాత మెరైన్ కమాండో ఫోర్స్ :మార్కోస్తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) భాగస్వామ్యం పంచుకోనుంది. ఈమేరకు బీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడికి వస్తున్నారు. సొరంగంలో పైకప్పు కుప్పకూలి బుధవారం ఉదయానికి నాలుగో రోజు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యల్లో వేగం పెంచింది. ఈమేరకు కీలక ఆపరేషన్కు ఆదేశాలిచ్చింది.
సంక్లిష్టమైనా ఛేదించేలా : సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే ఎనిమిది మంది గల్లంతయ్యారు. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరొక ఎత్తు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో గాలించాలని నిర్ణయానికి వచ్చారు.