Edupayala Jathara In Medak District : మంజీరా నది తీరాన రాతిగుహలో వెలిసిన మెదక్ జిల్లాలోని వనదుర్గమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. బుధవారం వనదుర్గమ్మకు మంత్రి దామోదర రాజనర్సింహ పట్టువస్త్రాలు సమర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. 3 రోజులు పాటు కనులపండువగా జరిగే జాతరకు సర్వం సిద్ధం చేశారు.
పంచామృతాభిషేకంతో : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తొలిరోజు బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వనదుర్గ అమ్మవారికి పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేకంగా అలంకరిస్తారు. సహస్రనామార్చన, కుంకుమార్చనల అనంతరం 5.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రెండో రోజైన గురువారం సాయంత్రము ప్రధాన ఘట్టం బండ్ల ఊరేగింపు ఉంటుంది. చివరి రోజైన శుక్రవారం రాత్రి రథోత్సవాన్ని చేపడతారు.

ఆలయం ముందు నదీపాయలో ఏర్పాటు చేసిన శివలింగం ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి వాటిపై టెంట్లు వేశారు. స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు, తలానీలాలకు తాత్కాలికంగా టెంట్లును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
వివిధ వసతులు : మిషన్ భగీరథ ఆధ్వర్యంలో 144 యూనిట్ల తాగునీటి నల్లాలు, 440 తాత్కాలిక శౌచాలయాలు, భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి నదీపాయల వద్ద 12 స్నానాలకు జల్లు స్నానాల పరికరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు నీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా 27 ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. చెత్త సేకరణకు 8 ట్రాక్టర్లతో పాటు, 5 ఆటోలు, 598 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు.
పక్కాగా నిఘా : జాతర పరిసరాలలో 100 సీసీ కెమెరాలను బిగించారు. మద్యం అమ్మకాల నిరోధానికి ఆబ్కారీశాఖ కంట్రోల్ రూంతో పాటు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. 9 సంచార బృందాలను(మొబైల్ టీంలను) నియమించారు.
వైద్య సేవలు :
భక్తుల సౌకర్యార్థం వైద్యశాఖ ఆధ్వర్యంలో ఓ తాత్కాలిక ఆసుపత్రితో పాటు 10 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. 25 మంది డాక్టర్లు, 226 మంది సిబ్బందిని నియమించారు. అత్యవసరానికి ఉపయోగపడే విధంగా 4 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
పార్కింగ్ ఇలా :
- ప్రయాణికులకు 2 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
- హైదరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్, బాలానగర్, కొల్చారం, పోతంశెట్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను 2 వంతెన వరకే అనుమతిస్తారు. టేకులగడ్డ వద్ద వాహనాలు నిలపవచ్చు.
- బొడ్మట్పల్లి, పాపన్నపేట, నాగ్సాన్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆలయానికి కిలోమీటర్ దూరంలోని చెలిమెకుంట వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
- వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వీలుగా 400 ఆర్టీసీ బస్సులు, టేకులగడ్డ పార్కింగ్ నుంచి ఆలయం వరకు ఉచితంగా 10 మినీ బస్సులను నడుపనున్నారు. విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా అదనపు నియంత్రికలను ఏర్పాటు చేశారు.
నదీపాయల్లో జలకళ : యాసంగి పంటల సాగుకు సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు 350 ఎంసీఎఫ్టీల నీటిని ఫిబ్రవరి 23న విడుదల చేయగా, మంగళవారం వనదుర్గా ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నుంచి నదీపాయలకు నీటిని వదిలడంతో జలకళను సంతరించుకున్నాయి. వంతెనల వద్ద లోపలికి భక్తులు వెళ్లకుండా బారికేడ్లు, సూచికలను బిగించారు.