Nursery Farmers Issues in Telangana : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పట్టణం నర్సరీలకు ప్రసిద్ధి గాంచింది. పటాన్చెరులో జాతీయ రహదారిని ఆనుకొని ఎక్కువగా నర్సరీలు ఏర్పడ్డాయి. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ రైతులు నర్సరీల మీద జీవిస్తూ పలువురికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి ఉండటంతో వివిధ రాష్ట్రాలకు వివిధ రకాల మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.
గత ప్రభుత్వం హరితహారం పథకం ద్వారా రైతులకు రాయితీలు ఇవ్వడంతో నర్సరీలకు మరింత ఆదరణ పెరిగింది. ఈ నర్సరీల్లో మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, ఇలా అనేక రకాల మెుక్కలతో పాటు పూలు, అందానికి వాడే మొక్కలు సైతం పెంచుతున్నారు. హైదరాబాద్ నుంచి ముంబయి వేళ్లే మార్గం కావడంతో ఈ నర్సరీలు ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇక్కడ మెుక్కలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
'మాకు మొక్కలంటే ప్రాణం - పొద్దున్నే లేచి వాటిని చూడకపోతే రోజు గడవదు'
Farmers Request to govt To Focus On Nursery Problems :నర్సరీలకు అందించే రాయితీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను మూడేళ్లుగా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సరీల నిర్వహణే కష్టంగా మారిందని తమకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సరీల్లో మెుక్క అంటుకట్టే దగ్గర నుంచి ఎదిగే వరకు ఈ నర్సరీల ద్వారా ఉపాధిని పొందుతున్న కూలీల పాత్ర కీలకమైనది. తమకు రోజూ రూ.350 కూలీ ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ నిర్వహణ కష్టంగా మారడంతో ఆ భారం తమపై పడుతుందేమోనని కూలీలు ఆవేదన చెందుతున్నారు.