NTR Bharosa Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ మొదలైంది. ఒకటో తేదీ రావడంతో సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సహా స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పింఛన్లను అందజేశారు.
సత్యసాయి జిల్లాలో పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటాపురం తండా, పరమేశ్వరపురం గ్రామాల్లో మంత్రి సవిత లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. ఈ ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాతూరు బ్రహ్మం గుడి వద్ద మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బాపట్ల జిల్లాఅద్దంకిలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సైతం ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. కాశిరెడ్డి కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది 8 నెలలుగా డెత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఓ మహిళ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది నెలలుగా ధ్రువీకరణ పత్రాన్ని ఎందుకు ఇవ్వలేదని సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ను ఆదేశించారు.
జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పింఛన్ లభ్డిదారులకు ఒకటో తేదీన వారి ఇళ్ళకు వెళ్లి ఇవ్వటం జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు,పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఖచ్చితంగా నిదానంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం ముద్దంపల్లి, బాలాయపల్లి మండలం నిడిగల్లు గ్రామాల్లో ఉదయాన్నే ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేరుకుని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. వృద్దులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్ళి అందించారు. కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.