తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు షాక్! - ఈసారి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్లే? - NO NEW RAILWAY PROJECTS TELANGANA

బడ్జెట్‌లో కేటాయింపుల్లో తెలంగాణకు రాని రైల్వే ప్రాజెక్టులు - గత ఏడాదితో పోలిస్తే అదనంగా పెరిగింది రూ.కోటి మాత్రమే.

Railway Projects In Telangana
No New Railway Projects To Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2025, 9:37 AM IST

No New Railway Projects To Telangana : బడ్జెట్‌లో కేటాయింపుల్లో తెలంగాణకు కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం దిల్లీలో రాష్ట్రానికి కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఈ కేటాయింపుల్లో గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.కోటి మాత్రమే పెరిగింది. 2024-25లో రైల్వే పద్దు కింద రూ.5,336 కోట్లు కేటాయిస్తే 2025-26లో ఆ మొత్తం రూ.5,337 కోట్లు. కాగా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగితేనే ఆయా ప్రాజెక్టులకు అధిక నిధులు వస్తాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నిధుల కేటాయింపులు భారీగా పెరిగిన పరిస్థితి కనిపించడం లేదు.

యాదాద్రి ఎంఎంటీఎస్‌ పట్టాలెక్కేనా? : ఘట్‌కేసర్‌-రాయగిరి(యాదాద్రి) ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పట్టాలెక్కేలా లేదు. 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని ఏడాది క్రితమే రైల్వేశాఖ తెలిపింది.

సంవత్సర కాలంలో డీపీఆర్‌ సిద్ధం చేశారు కానీ రైల్వేబోర్డుకు పంపడం, ఆమోదించి నిధులు మంజూరుచేసే ప్రక్రియలో రైల్వేశాఖ జాప్యం చేసింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే యాదాద్రికి వెళ్లే భక్తులకు ఎంఎంటీఎస్‌ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలోనే ఉంది. రూ.650 కోట్లతో యాదాద్రి ఎంఎంటీఎస్‌ నిర్మాణం పూర్తవుతుంది.

మూడో లైను నిర్మాణ పనులు : విజయవాడ నుంచి కాజీపేటకు, కాజీపేట నుంచి బల్హార్ష వైపు మూడో లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కీలకమైన కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో మూడో లైను ఇంకా మంజూరు కాలేదు. ఈ మార్గంలో రెండు లైన్లలోనే అటు ప్రయాణికుల రైళ్లు, ఇటు గూడ్సు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మూడో లైను మంజూరై నిర్మాణం జరిగితేనే సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ వైపు అలాగే విజయవాడ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు వేగవంతమవుతాయి.

రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు : గతంలో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టేది. కొత్త రైళ్ల మంజూరు, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌ వంటి ఆసక్తికరమైన విషయాలు రైల్వే ప్రత్యేక బడ్జెట్‌లో వెంటనే తెలిసేవి. కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లోనే రైల్వేలకు కేటాయింపులను చూపిస్తున్నారు. కాగా రైల్వే ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులను తెలిపే ‘పింక్‌ బుక్‌’ను బుధ, గురువారాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రానికి ఈసారైనా కొత్త రైళ్లు వచ్చేనా? - కేంద్ర బడ్జెట్‌పై సర్కార్ గంపెడాశలు!

సర్వేలు పూర్తయినా - పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు - ఇక ఎంపీల చొరవతోనే సాధ్యం! - Delay In Telangana Railway Projects

ABOUT THE AUTHOR

...view details