Mobile App for Telangana Rythu Bima Scheme : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు అమలు చేస్తున్న రైతుబీమా పథకం కోసం ఇక నుంచి మొబైల్ యాప్ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు నివారించి, పథకాన్ని సజావుగా అమలు చేసేలా రూపకల్పన చేస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే, ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తున్నారు. ఆ పథకం కోసం జీవిత బీమా సంస్థకు పదేళ్లుగా రైతుల ప్రీమియంను సర్కారే చెల్లిస్తోంది. అయితే పథకం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు.
ఆధార్లో అచ్చు తప్పులు : వయో పరిమితి సమస్యకు తోడు ఆధార్లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందట్లేదు. కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు వంటివి సులభతరమవుతాయని అధికారులు చెబుతున్నారు.