ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 4:40 PM IST

ETV Bharat / state

విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది: లోకేశ్

Nara Lokesh Shankharavam Meeting: విశాఖను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చంద్రబాబు చేస్తే, గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో శంఖారావం సభలో లోకేశ్ పాల్గొన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక విశాఖను విషాదపట్నంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara_Lokesh_Shankharavam_Meeting
Nara_Lokesh_Shankharavam_Meeting

Nara Lokesh Shankharavam Meeting: తెలుగుదేశం హాయంలో ఎన్నో కంపెనీలను తెస్తే, వైసీపీ ప్రభుత్వం వాటిని తరిమేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ వరాల జల్లు కురిపించారు.

తెలుగుదేశం- జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ యత్నిస్తోందని విమర్శించారు. పసుపు సైన్యం, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే రెండు నెలలు చాలా కీలకమని లోకేశ్ తెలిపారు. ఇరుపార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. విశాఖను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చంద్రబాబు చేస్తే, వైసీపీ ప్రభుత్వం గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చేసిందని లోకేశ్ మండిపడ్డారు.

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయమని అన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక విశాఖను విషాదపట్నంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవారని తెలిపారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రోజుకొక భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలెట్టారని లోకేశ్ విమర్శించారు.

రుషికొండ ప్యాలెస్​ను ప్రజలకు అంకితం చేస్తాం : నారా లోకేశ్​

టీడీఆర్ బాండ్ల పేరుతో వైసీపీ నేతలు భూములు కొట్టేశారని లోకేశ్ ఆరోపించారు. లాలూచీతో విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సీఎం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.

రైల్వే జోన్‌, నగరానికి మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్‌ నెరవేర్చలేదని లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు సూపర్‌-6 పేరుతో హామీలను ప్రకటించారని, అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని, నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు అందజేస్తామని లోకేశ్‌ తెలిపారు.

కొండలు, క్వారీలు, పోర్టులు, ఇలా వైసీపీ నేతలు దేన్నీ వదలట్లేదని లోకేశ్ విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పని అని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ను మూసేసి కార్మికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఓ భస్మాసురడని ఎద్దేవా చేశారు. రాబోయే రెండు నెలల్లో జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.

సూపర్‌ 6 మ్యానిఫెస్టో చూసి జగన్‌ భయపడుతున్నారు: లోకేష్‌

విశాఖను గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా వైసీపీ ప్రభుత్వం మార్చేసింది: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details