తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ధర్నా - అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక! - MLA KAUSHIK REDDY DHARNA HUZURABAD

దళిత బంధు లబ్ధిదారుల దరఖాస్తులకు పిలుపునిచ్చిన కౌశిక్​ రెడ్డి - ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు

KOUSHIK REDDY DHARNA
MLA KOUSHIK REDDY IN HUJURABAD (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 5:42 PM IST

Updated : Nov 9, 2024, 7:00 PM IST

MLA Kaushik Reddy Dharna : దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్‌లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. దళిత కుటుంబాలతో కలిసి అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించేందుకు వస్తుండగా తోపులాట చోటు చేసుకుంది. జిల్లా పోలీసులకు, దళితులకు మధ్య జరిగిన ఈ తోపులాటలో ఓ మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం దళిత కుటుంబాలతో కలిసి కౌశిక్‌ రెడ్డి అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర దాదాపు గంట పాటు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాతో కరీంనగర్‌ - వరంగల్‌ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కౌశిక్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడం రావట్లేదని చెప్పడంతో తక్షణమే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా చేస్తే, పోలీసులు తనతోపాటు, ధర్నా చేస్తున్న వారిని తీవ్రంగా కొట్టారని కౌశిక్‌ రెడ్డి విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు.

ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?:హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్​రావు ఫోన్‌ చేసి ఘటన జరిగిన తీరు, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, బీఆర్​ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అంశంపైనా న్యాయపరంగా ముందుకెళ్దామని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని హరీశ్​రావు దుయ్యబట్టారు.

దళిత బంధు సాయం అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా?: ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. దళిత బంధు సాయం అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని మండిపడ్డారు. ‘‘ ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు పని చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. కౌశిక్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష పెంచుకున్నారు. అరికెపూడి గాంధీతో అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం రేవంత్​ రెడ్డి దాడి చేయించారు. కౌశిక్‌ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అరెస్టు చేసిన బీఆర్​ఎస్​ కార్యకర్తలందర్నీ వెంటనే విడుదల చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమౌతా : కేటీఆర్​

'అద్దెకు ఉంటామని తీసుకుని - మాకు తెలియకుండానే మా బిల్డింగ్ అమ్మేశారు'

Last Updated : Nov 9, 2024, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details