MLA Kaushik Reddy Dharna : దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. దళిత కుటుంబాలతో కలిసి అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించేందుకు వస్తుండగా తోపులాట చోటు చేసుకుంది. జిల్లా పోలీసులకు, దళితులకు మధ్య జరిగిన ఈ తోపులాటలో ఓ మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం దళిత కుటుంబాలతో కలిసి కౌశిక్ రెడ్డి అంబేడ్కర్ చౌరస్తా దగ్గర దాదాపు గంట పాటు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాతో కరీంనగర్ - వరంగల్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కౌశిక్రెడ్డిని పోలీస్స్టేషన్కు తరలించారు. శ్వాస తీసుకోవడం రావట్లేదని చెప్పడంతో తక్షణమే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా చేస్తే, పోలీసులు తనతోపాటు, ధర్నా చేస్తున్న వారిని తీవ్రంగా కొట్టారని కౌశిక్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు.
ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?:హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఫోన్ చేసి ఘటన జరిగిన తీరు, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అంశంపైనా న్యాయపరంగా ముందుకెళ్దామని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని హరీశ్రావు దుయ్యబట్టారు.