Deputy CM Bhatti Vikramarka Of SLBC Tunnel Accident :శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కోమటి రెడ్డి వెంకట రెడ్డిలు స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ఆద్వర్యంలోని మంత్రులబృందం నేడు ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను నేడు స్వయంగా అంచనా వేశారు. అనంతరం, వారు ప్రాజెక్ట్ స్థలంలోని జేపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు.
బురద ఉంది :ఈ సందర్బంగా ప్రమాద సంఘటన జరిగిన విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తోసహా సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎస్ఎల్బీసీ సంఘటన స్థలంలో 40 నుంచి 50 మీటర్ల మేర బురద నిండుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 42 మంది సురక్షితంగా బయటికి రాగా, 8 మంది లోపల చిక్కుకున్నారని వివరించారు. బురద నీటిని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. ఎడమ కాలువ టన్నెల్లో 11 కిలోమీటర్ల తర్వాత నీటితో కలిగివుందని, అయినప్పటికీ 11.5 కిలోమీటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు.
13.50 కిలోమీటర్ల వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుంచి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనదని అన్నారు. సొరంగంలో ఎంత దూరం వరకు బురద, నీరు ఉందనేది జీఎస్ఐ, ఎంజీఆర్ఐలు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు. చివరి 40 మీటర్లలో నీరు, బురద మట్టితో ఉందని ఏవిధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్టు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు ఈ బురద ఉందని అన్నారు.
ప్రస్తుతం టన్నెల్లో 10 వేల ఘనపుటడుగుల (క్యూబిక్ మీటర్లు ) బురద ఉందని ప్రాధమికంగా అంచనా వేశామని, ఈ బురద నీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్కు మరమత్తులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్కు రేపు సాయంత్రం లేదా ఎల్లుండిలోగా మరమత్తులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుతడుల బురదను బయటికి తీయ వచ్చని అన్నారు. వీటిని మరింత త్వరిత గతిన వెలికి తీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీలను తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్లో గంటకు 3600 నుండి 5000 లీటర్ల ఊట నీరు వస్తుందని తెలిపారు. లోపలి నుంచి నీటితో పాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్ లైన్ వినియోగించనున్నామని స్పష్టం చేశారు.