Minister Ponguleti Comments On BRS :పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ్ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ఫోన్ ట్యాపింగ్, ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. వారిని అరెస్టు చేయాలా? లేదా జీవిత కాలం జైళ్లో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుందని మంత్రి తెలిపారు.
ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందన్న పొంగులేటి, అది ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి వారు ఫలితాలు అనుభవించారని ఆరోపించారు. నాలుగో రోజు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ప్రతినిధుల బృందం, మూసీ సుందరీకరణ తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేస్తుంది.
'గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. కొందరు డబ్బులకు ఆశపడి ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంది. మేము సియోల్ నుంచి హైదరాబాద్లో దిగేలోపే పేలుతుంది. అరెస్టు చేయాలా, జీవిత కాలం జైళ్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. మా నిర్ణయం కాదు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారు. చట్టాలు అతిక్రమించిన వారు ఫలితాలు అనుభవిస్తారు." - మంత్రి పొంగులేటి