Leopard Wandering At Mahanandi Temple in Nandyala : ఏపీలోని నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు రెండు సార్లు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచరించడంతో పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన నాగన్న అనే యువకుడిపై చిరుత దాడి చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిక ఏర్పాటు చేశారు.
గత కొన్ని రోజులుగా చిరుత సంచారం మహానంది పరిసరాల్లో ఏదో ఒక ప్రదేశంలో కొనసాగుతుంది. మహానందిలోని టీటీడీ సత్రాల సమీపంలో గురువారం ఉదయం చిరుత కుక్కను నోటితో పట్టుకొని వెళ్లిందని, సాయంత్రం మహానందీశ్వరనగర్, ఎంప్లాయిస్ కాలనీలో కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదని చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను బందించేందకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.