తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేవంత్ సాబ్ ప్రజాపాలన అంటే ఇదేనా?' - కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ రియాక్షన్ - KTR REACTION OVER CASE ON BRS MLA

KTR Slams Congress Over Case on Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ ​రెడ్డిపై కేసు నమోదు ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ విమర్శలు గుప్పించారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 12:42 PM IST

Updated : Jul 3, 2024, 1:32 PM IST

KTR reaction
KTR reaction (ETV Bharat)

KTR Reaction on MLA Kaushik Reddy Case : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పన పైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా అని నిలదీశారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేంటని ప్రశ్నించారు.

'ప్రభుత్వాధికారి అయిన డీఈఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహారిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా కౌశిక్ రెడ్డి కి హక్కు లేదా? దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవ్వడంతోపాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్​ పోస్టింగ్ ఇవ్వాలని మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ అడిగారు. ఇది కూడా నేరమేనా?' అని కేటీఆర్ నిలదీశారు.

దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన పోరాట ఫలితమే కాళేశ్వరం : కేటీఆర్​ - KTR on Kaleshwaram project

జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవటంతో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా? కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గ పూరిత చర్య. - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

వెంటనే కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కేటీఅర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం, అక్రమాలను బయటికి తెస్తున్నారని పేర్కొన్నారు. అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రశ్నించే మీడియా, ప్రజాప్రతినిధులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Last Updated : Jul 3, 2024, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details