Kisan Reddy Comments On State President : జనవరి నెలాఖరుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, కొత్త అధ్యక్షుడు పేరు ఖరారవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ వ్యక్తే ఉండాలనే నియమం ఏం లేదన్నారు. నామినేటెడ్ ప్రక్రియ ద్వారానే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇప్పుడు నియమించిన వ్యక్తే అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు.
అప్పటి వరకు ఆందోళనలు చేయం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం సీట్లకు పోటీ చేస్తామని, ఈసారి మెజారిటీ సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. స్థానిక పోరులో బీజేపీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీగా ఆయన అభివర్ణించారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆందోళనలు, పోరాటాలు చేయకూడదని జాతీయ నాయకత్వం ఆదేశాలు ఉన్నాయని, అందుకే అలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.
ఉచితాలు వద్దని మేమెప్పుడు చెప్పలేదు :బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఇప్పటికే 610 మండలాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేశామని, మండలాల్లో మహిళా అధ్యక్షులను కూడా నియమించినట్లు తెలిపారు. 50శాతం బీసీలను మండలాలకు అధ్యక్షులుగా నియమించామని, 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినంత మాత్రాన దిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని, రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులను కేటాయించినట్లు తెలిపారు.
200 ఎకరాలు ఇస్తే సరి : చిరంజీవి సినీ పరిశ్రమలో మెగాస్టార్. అందుకే తాను ఇటీవల సంక్రాంతి వేడుకలకు రావాలని ఆహ్వానం పలికినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాము అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం 200 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.