Industrialist VC Janardhan Rao Murder Case Update :హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును (86) సొంత మనువడి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కిలారు కీర్తి తేజను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో తాతను కక్షతో కీర్తి తేజ చంపాడు. జనార్దన్ రావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.
పోలీసులకు సహకరించకుండా వింత చూపులు : హత్య జరిగిన రోజే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతని నుంచి హత్య విషయంలో మరింత సమాచారం సేకరించడానికి నిందితున్ని పంజాగుట్ట పోలీసులు కష్టడీకి తీసుకున్నారు. మొదటిరోజు పోలీసులకు సహకరించకుండా వింత చూపులు చూస్తూ తనలో మాట్లాడినా ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను పోలీసు అధికారుల ఎదుట వివరించినట్టు సమాచారం.
కష్టడీలో కీర్తితేజ చెప్పిన విషయాలు : యూ బెగ్గర్ అంటూ తాత ప్రతిరోజూ అవమానించేవాడని ఏరోజూ తనని సొంత మనిషిగా చూడలేదని కీర్తి తేజ పోలీసుల విచారణలో తెలిపాడు. తనను కుటుంబ సభ్యుడిగా కూడా ఏనాడూ చూడలేదని తెలిపాడు. అందరి కంటే హీనంగా చూసేవాడని ప్రతిరోజూ నన్ను బెగ్గర్ అనే పిలిచేవాడని చెప్పాడు. ఆఫీసులో కూడా అందరి ముందు అవమానించేవాడని దీంతో ఆఫీస్ వారు కూడా చిన్నచూపు చూసేవారన్నారు.