Jangaon Engineer Murder In Uganda:ఉగాండా దేశంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జనగామకు చెందిన ఇంజినీర్ తిరుమలేశ్ మరణించారు. తిరుమలేశ్ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ పట్టణం తొమ్మిదో వార్డు గిర్నిగడ్డకు చెందిన ఇటికాల తిరుమలేశ్ (42) సివిల్ ఇంజినీర్ పూర్తి చేశారు. కొంతకాలం కరీంనగర్లో ఉద్యోగం చేసిన అనంతరం, ఉగాండా దేశంలోని రాయల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అవకాశం రావడంతో పదేళ్ల క్రితం అక్కడికి వెళ్లారు. ప్రాజెక్టు మేనేజర్ హోదాలో పని చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉగాండాలోని నమ్మశాల ప్రాంతంలోని కంపెనీలో శుక్రవారం తిరుమలేశ్ విధుల్లో ఉండగా, శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) అదే కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో ఒక్కసారిగా తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. భారీ శబ్ధం విని బయటకు వచ్చిన తిరుమలేశ్పైనా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
ఈ ఘటనతో భయకంపితులైన కంపెనీలోని ఇతర ఉద్యోగులు బయటకు రాలేదు. తిరుమలేశ్ మృతి చెందిన విషయాన్ని కంపెనీ ప్రతినిధులు జనగామలో ఉంటున్న తల్లి కిష్టమ్మ, సోదరుడు చిన్నాకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. తిరుమలేశ్కు భార్య సునీత, కుమార్తె అఖిల, కుమారుడు వరుణ్ ఉన్నారు. కుమార్తె అఖిల నిజామాబాద్లోని అమ్మమ్మ ఇంటి వద్ద 8వ తరగతి చదువుతోంది. కుమారుడు వరుణ్ ఉగాండాలోనే తల్లిదండ్రులతో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు.