AI Global Summit in Hyderabad 2024: ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్కు సర్వంసిద్ధమైంది. నేడు, రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సదస్సు నిర్వహిస్తోంది. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలో తొలిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేథ రంగంలో పేరొందిన ప్రముఖులు వివిధ సంస్థల ప్రతినిధులు 2 వేల మంది ఈ సదస్సు లో పాల్గొననున్నారు.
200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ :సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్లను అందులో ప్రదర్శించనున్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రెండు రోజుల పాటు ఏఐ సదస్సు : ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని వివరించేలా ఈ ఏఐ గ్లోబల్ సదస్సును నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన అనంతరం రోడ్టు మ్యాప్ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగంలో చూసినా ఏ నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే పదం తరచుగా వినిపిస్తోంది.