Illegal Soil Transport in Mahabubnagar :ప్రకృతి వనరులకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పే అధికారుల మాటలు, హెచ్చరికలు కార్యరూపం దాల్చకపోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో యథేచ్ఛగా సహజ వనరుల ధ్వంసం జరుగుతోంది. ఎక్కడ మట్టి దొరికితే అక్కడ గద్దల్లా వాలి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. వాహనాలు పట్టుబడితే అవి మనవాళ్లవే వదిలేయండని బడా నేతలు హెచ్చరిస్తున్నారని జిల్లా కోడై కూస్తోంది.
- జిల్లాలో ఇద్దరు బడా నేతలు మట్టి దందాను కొనసాగిస్తున్న వారికి గాడ్ ఫాదర్లుగా అభయ హస్తం అందిస్తున్నారు. జిల్లాను రెండు ప్రాంతాలుగా విడదీసి, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో దందా కొనసాగిస్తుండటంతో వీరిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
- గట్టు మండలానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తరలిస్తున్నారని చర్చ జరుగుతోంది.
- గద్వాల మండలం నాయకుని కుటుంబ సభ్యులు, మల్దకల్ మండలానికి చెందిన యువ నాయకుడు మట్టి దందాను చేస్తున్న వారిలో కీలకంగా ఉన్నారని సమాచారం. వీరంతా బడా నేతల ముఖ్య అనుచరులుగా గుర్తింపు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోడానికి వెనకాడుతున్నారు.
- వారం కిందట ఇటిక్యాల మండలంలో మట్టి తవ్వకాలు జరుపుతున్న వారికి, బడా నేతకు మధ్య కమీషన్ విషయంలో వివాదం రావడంతో తవ్వకాలను నిలిపి వేయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.