తెలంగాణ

telangana

ఉమ్మడి గుంటూరు జిల్లాను వణికిస్తున్న వరుణుడు - కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి - Heavy rain in joint Guntur district

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 4:30 PM IST

Updated : Aug 31, 2024, 4:52 PM IST

Heavy Rains in AP: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా వణుకుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరులోని కలెక్టర్​ కార్యాలయ రహదారి, మూడు వంతెనల మార్గం, చుట్టుగుంట మహాత్మాగాంధీ ఇన్నర్​ రింగ్​రోడ్డు, శివారెడ్డి పాలెం పరిసరాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు.

Heavy Rains in Joint Guntur District
Heavy Rains in Joint Guntur District (ETV Bharat)

Heavy Rains in Joint Guntur District : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీటిలో కార్లు, బైకులు ఆగిపోవటంతో రామవరప్పాడు రింగు రోడ్డు నుంచి నిడమానూరు వరకూ ట్రాఫిక్​ జామ్​ అయింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మోకాళ్ల లోతులో నీరు ప్రవహిస్తోంది. నగరంలోని శివారు కాలనీలను వరద ముంచెత్తగా, ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పెద్దకాకాని మండలం ఉప్పలపాడులో వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు. పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది.

మరోవైపు భారీ వర్షాలకు ఏపీ రాజధాని ప్రాంతంలోనూ, మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అమరావతిలోని పొట్టేళ్ల వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. రత్నాల చెరువులోని నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కో, తాడేపల్లి ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి.

అలాగే బాపట్ల జిల్లాలో వర్షం దంచికొడుతోంది. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో రహదారులు జలమయం అయ్యాయి. చీరాల, బాపట్ల, వేటపాలెం, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, అద్దంకి, కారంచేడు, రేపల్లె, నగరం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దళితవాడలోని రైతు సేవా కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.

నీట మునిగిన ఆర్టీసీ బస్సు : పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు ప్రవహించగా, ప్రయాణికులు, విద్యార్థులతో వచ్చిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ట్రాక్టర్​ సహాయంతో బస్సును బయటకు తీశారు. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వంతెనపై నీరు పొంగి ప్రవహిస్తోండటంతో సత్తనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పంటపొలాల్లో వర్షపు నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళగిరి టోల్​ప్లాజా జలమయం : గుంటూరులోని ఆటోనగర్​, పెద్దకాకాని పీఎస్​ సమీపం జలమయం అయింది. మంగళగిరి టోల్​ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోల్​గేట్​ వద్ద ప్రధాన రహదారిపైకి భారీగా వర్షకు నీరు చేరడంతో ట్రాపిక్​ సమస్య ఏర్పడింది. వరద నీటితో మంగళగిరి టోల్​ ప్లాజా ప్రాంతం జలమయం అవ్వడంతో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో భారీ వర్షాలు - చెరువులుగా మారిన రహదారులు - ఇళ్లల్లోకి చేరిన వరద నీరు - Heavy Rains IN Telangana

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు - నలుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు - Vijayawada Landslide Deaths

Last Updated : Aug 31, 2024, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details