Heavy Rain Fall in Anantapur : ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రికార్డుస్థాయి వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో అనంతపురం గ్రామీణ మండలంలోని రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల్లోకి ఐదు అడుగులమేర వరద నీరు చేరింది. ఇళ్లు, వాహనాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముష్టూరు వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి ప్రవాహాన్ని గుర్తించకపోవడంతో మూడు బస్సులు వరదలో చిక్కుకున్నాయి. రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకును వరదనీరు ముంచెత్తింది.
పెనుకొండ మండలంలోని మునుమడుగు వద్ద ఉన్న కియా అనుబంధ పరిశ్రమలకు వెళ్లే రహదారి కోతకు గురైంది. సుమారు 2వేల మంది కార్మికులు పరిశ్రమలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే ప్రమాదకరంగా నడుచుకుంటూ కార్మికులు అవతలి వైపు వెళ్లారు.
పరిశీలించిన నాయకులు :ఆకస్మికంగా వరదలు రావడంతో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేయడంతో నష్టతీవ్రత తగ్గిందని తెలిపారు.
హైదరాబాద్లో భారీ వర్షం - మరో రెండురోజుల పాటు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్