తెలంగాణ

telangana

ETV Bharat / state

అనంతపురాన్ని ముంచెత్తిన వరద - బయటకు వెళ్తే కొట్టుకుపోతారు!

అనంతపూర్​లో భారీ వర్షాలు - కుండపోతల మారినా రోడ్లు, కాలనీలు - తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

Heavy Rain Fall in Anantapur
Heavy Rain Fall in Anantapur (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

Heavy Rain Fall in Anantapur : ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రికార్డుస్థాయి వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో అనంతపురం గ్రామీణ మండలంలోని రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల్లోకి ఐదు అడుగులమేర వరద నీరు చేరింది. ఇళ్లు, వాహనాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముష్టూరు వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి ప్రవాహాన్ని గుర్తించకపోవడంతో మూడు బస్సులు వరదలో చిక్కుకున్నాయి. రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకును వరదనీరు ముంచెత్తింది.

పెనుకొండ మండలంలోని మునుమడుగు వద్ద ఉన్న కియా అనుబంధ పరిశ్రమలకు వెళ్లే రహదారి కోతకు గురైంది. సుమారు 2వేల మంది కార్మికులు పరిశ్రమలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే ప్రమాదకరంగా నడుచుకుంటూ కార్మికులు అవతలి వైపు వెళ్లారు.

పరిశీలించిన నాయకులు :ఆకస్మికంగా వరదలు రావడంతో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేయడంతో నష్టతీవ్రత తగ్గిందని తెలిపారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం - మరో రెండురోజుల పాటు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

పంట నష్టం గురించి :భారీ వర్షానికి రాప్తాడు, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వరి, కంది, వేరుశనగ, టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీటమునిగిన పంటలను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. పంట నష్టం గురించి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్‌లో వివరించారు. కనగానపల్లి చెరువు వద్ద గండి పడిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.

నిలిచిన రాకపోకలు : శ్రీ సత్యసాయి జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్తపల్లి, కమ్మవారిపల్లి చెరువులు పొంగిపొర్లడంతో కర్ణాటక వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తనకల్లు మండలంలోని వరాలపల్లి, మరాలపల్లి గ్రామాల పరిధిలోని ప్రధాన రహదారిపై వందమానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఓబులదేవరచెరువు మండలంలో గోడ కూలి ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. బుక్కపట్నం మండలంలో అగ్రహారం చెరువు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధర్మవరం చెరువుకు చిత్రావతి నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో జలపాతాన్ని తలపించేలా మరువ ప్రవహిస్తోంది. మరువను చూసేందుకు ధర్మవరం చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి కనబరిచారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఆ జిల్లాల్లో మళ్లీ టెన్షన్ టెన్షన్

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రాగల 3 రోజుల పాటు వర్షాలు

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details